అక్కతో గొడవ, చెల్లె ఆత్మహత్య: ఆయుధాలతో చిక్కిన ఇద్దరు
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అక్కతో గొడవ పడి చెల్లెలు లయ(11) ఆత్మహత్య చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు అక్కచెల్లెళ్ల సైకిల్ విషయంలో ఘర్షణ జరిగింది. అక్క మందలించిందనే మనస్థాపంతో చెల్లెలు లయ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే లయను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కల్తీ కల్లు తాగి ఒకరు మృతి
ఇదిలావుంటే, కల్తీ కల్లు ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. కల్తీ కల్లు తాగి ఇటీవల నిజామాబాద్లో ముగ్గురు మృతి చెందగా, శనివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వికారాబాద్ రైల్వే ఉద్యోగి కల్తీ కల్లు తాగాడు. కల్లు కాంపౌండ్ నుంచి బస్టాండ్కు నడుచుకుంటూ వచ్చి కుప్పకూలిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరి అరెస్టు
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తుపాకులను, పది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందినవారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు.
వ్యాపారిపై హత్యాయత్నం
రంగారెడ్డి జిల్లాలోని షాపూర్నగర్లో వ్యాపారి జాకీర్పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాప్రయత్నం చేశారు. అందరూ చూస్తుండగానే వ్యాపారిని కత్తులతో పొడిచి పారిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జాకీర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications