బైక్ రేసా?: యువతి మృతి, అతడికి గాయాలు
హైదరాబాద్: సంఘీ ఆలయానికి వెళ్తూ బైక్ అదుపు తప్పి కిందపడటంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శృతిలయ(20) తన కుటుంబంతో కలిసి హిమయత్ నగర్లో ఉంటోంది. శృతిలయ స్థానికంగా ఉన్న కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
శనివారం సంఘీ టెంపుల్ వెళ్లి వస్తామని చెప్పి తల్లికి చెప్పి బయలుదేరింది. తోటి విద్యార్థి హరీష్తో కలిసి కొత్త హోండా యాక్టివా పైన బయలుదేరింది. ఉమర్ గూడ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. శృతిలయకు బలమైన గాయం కావడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. హరీష్ కాలు విరిగింది. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా, కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు నాలుగు బైకుల పైన సంఘీ ఆలయానికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పోటీలు పడి వేగంగా వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తభానికి ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం సమయంలో శృతిలయ బైక్ నడిపినట్లుగా సమాచారం.
సాగర్ ఎడమ కాల్వలో ఆటో బోల్తా, ముగ్గురు మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావుల పెంట వద్ద సాగర్ ఎడమ కాల్వలో ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలు ఆటోలోనే చిక్కుకున్నాయి.