ఆమె 'సూసైడ్ నోట్' చదివితే గుండె తరుక్కుపోవాల్సిందే..
కామారెడ్డి: 'ఉరివేసుకోవడం ఎలాగో తెలియడం లేదు..' సూసైడ్ నోట్లో ఆమె రాసిన ఈ మాట గుండెను మెలిపెట్టింది. చదువే లోకంగా ఎలాగైనా ఉద్యోగం సంపాదించడమే ధ్యేయంగా బతికిన ఆమె.. ఆ కల ఇక నిజం కాదన్న భయంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

అసలేం జరిగింది?:
ఎలాగైనా టీచర్ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన జాప సుప్రజ (24) కష్టపడి తన చదువుతోంది. ఇటీవలే టీచర్ నియామక పరీక్ష (టీఆర్టీ) కూడా రాసింది. కానీ అందులో తక్కువ మార్కులు రావడం ఆమెను తీవ్రంగా కుంగదీసింది.

మనస్తాపంతో ఆత్మహత్య:
టీఆర్టీ రిజల్ట్ కూడా రానే లేదు, కానీ ఎక్కడ తనకు తక్కువ మార్కులు వస్తాయోనని భయపడింది. తీవ్ర మనస్తాపంతో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది.

సూసైడ్ నోట్:
'నాన్నా నన్ను క్షమించండి. చాలా కష్టపడి చదివాను. కానీ ఫలితం లేకుండా పోయింది. నేనే నా చేతులారా చేసుకున్నా. నాకు ఇక బతికే అవకాశం లేదు. టీచర్ వృత్తిపై తప్ప దేనిపైనా నాకు ఆశలేదు. ఇన్నాళ్లు నా కోసం మీరు చాలా కష్టపడ్డారు. ఇకపై ఆ అవసరం లేదు.'

ఉరేసుకోవడం ఎలాగో..:
'నాకు ఉద్యోగం వస్తుందని చాలా కష్టపడి చదివాను. కానీ ఈ రోజు చాలా బాధగా ఉంది. నేను అనుకున్న జీవితం దక్కలేదు. క్షమించండి నాన్నా. నాకు ఉరివేసుకోవడం ఎలాగో తెలియడం లేదు. నా వల్ల ఎవరూ బాధపడొద్దు.
విధి నాతో ఆడుకుంది. చదువురాని దానిలా ముద్రవేసింది. నా కంటే చిన్నవాళ్లు నా ముందే పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా నాకు తర్వాత జీవితం ఉందనకున్నా. కానీ ఇప్పుడు నాకు భవిష్యత్తు లేదు. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి నాన్నా..' అంటూ సుప్రజ సూసైడ్ నోట్లో తన ఆవేదన వ్యక్తం చేసింది.
కేసు నమోదు:
ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి సుప్రజ మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications