తారుమారు: అమ్మాయే అబ్బాయి అయితే...
సంగారెడ్డి: పదిహేడేండ్లపాటు జడ వేసుకుని, బొట్టు పెట్టుకుని చుడీదార్ వేసుకున్న అమ్మాయి ఇప్పుడు ప్యాంట్ వేసుకుని అబ్బాయిగా మారిపోయాడు. వైద్య చరిత్రలో ఓ వింత ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. మెదక్ జిల్లా చిన్నశంకంరపేట పరిధిలోని బాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతుల కూతురు భవాని (17)గా పెరిగి పెద్దదైంది.
ప్రస్తుతం మెదక్లో బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో చేరింది. గత ఏడాది డిసెంబర్లో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో హైదరాబాద్కు తరలించగా భవానీ అమ్మాయి కాదు..అబ్బాయని వైద్యు లు నిర్ధారించారు. బాలుడిగా జన్మించిన భవాని పురుషాంగం శరీరంలోనే ఉండిపోవడంతో తల్లిదండ్రులు బాలికగానే భావించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి శరీరంలోని పురుషాంగాన్ని బయటికి తీశారు.
భవాని ఇప్పుడు భానుప్రసాద్గా మారాడు. మరో రెండు శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రెండేండ్ల కిందట వైద్యులను సంప్రదించినప్పుడు భవానికి ఆడపిల్లకు ఉండాల్సిన అవయవాలు లేవని, పెండ్లి ఆలోచన విరమించుకోవాలని వైద్యులు చెప్పారని తల్లి భాగ్యమ్మ తెలిపింది. భర్త నాగులు 15 ఏండ్ల కిందటే మృతిచెందాడని తెలిపింది. అమ్మాయి కాస్తా అబ్బాయిగా మారడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు.