మత్తు బిళ్లలతో మైకంలోకి దింపి ఆమెను పడుపు వృత్తిలోకి దింపారు
పని ఇప్పిస్తామని చెప్పి మత్తు మందు ఇచ్చి మైకంలోకి పెట్టి ఓ బాలికను వ్యభిచారం రొంపిలోకి దింపిన దంపతుల వైనం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: పేద కటుుంబంలో పుట్టిన ఓ బాలికను పడుపు వృత్తిలోకి దింపిన దంపతుల వైనం వెలుగులోకి వచ్చింది. మత్తు బిళ్లలు ఇచ్చి మైకంలోకి దింపి ఆమెతో వ్యభిచారంలోకి దింపారు. ఈ ఘటన గత రెండు నెలలుగా జరుగుతోంది. ఈ సంఘటన హైదరాబాదు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరా లిలా ఉన్నాయి.
నిరుడు నవంబరులో పని కల్పిస్తామని పాతబస్తీకు చెందిన 15 ఏళ్ల బాలికను లంగర్హౌజ్కు చెందిన షాహీన్, ముక్తార్ దంపతులు తీసుకువచ్చారు. గోల్కొండ సమీపంలో కొనసాగుతున్న వ్యభిచార గృహంలోకి బాలికను చేర్చారు. బలవంతంగా రొంపిలోకి లాగారు. తనను వదిలేయమంటూ వేడుకున్నా వినలేదు.
భార్యభర్తలిద్దరూ బాలికను ఓ గదిలో బంధించారు. టాబ్లెట్స్, మత్తు పదార్థాలను ఇచ్చి మత్తులోకి చేరగానే విటులను పంపేవారు. అక్కడ నుంచి బయట పడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవ టంతో ఏడుస్తూ కాలం గడుపుతూ వస్తోంది. బాలిక కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ప్రతినెలా కొంత నగదు పంపుతుండేవారని సమాచారం.
బాలిక బంధువు సాయంతో చెరనుంచి తప్పించుకున్న బాలిక గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. షాహీన్, ముక్తార్పై కేసు నమోదు చేశారు.