గిరిజన బాలికల హత్య మిస్టరీ: 15 రోజులు నిర్బంధించి, నరికేశారా?
వరంగల్: గిరిజన బాలికలు బానోతు ప్రియాంక (14), బానోతు భూమిక (14) మిస్టరీ మరణాల కేసులో వ్యవహారమంతా మల్లంపెల్లి గ్రామం చుట్టూనే తిరుగుతున్నట్లు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. నవంబరు 23న ఇంటి నుంచి హాస్టల్కు బయల్దేరి కనిపించకుండా పోయిన ఈ బాలికలు ఈ నెల 27న కుళ్లిపోయిన స్థితిలో జల్లిగుట్టల్లో కనిపించిన సంగతి తెలిసిందే.
పర్వతగిరి నుంచి వచ్చిన బాలికలు మల్లంపెల్లి గుండా శ్రీనగర్ వెళ్లి మరుసటి రోజు 24న మల్లంపెల్లి మీదుగా నర్సంపేటకు వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. మల్లంపెల్లిలో పురుగుల మందును కొన్నట్టు, ఆ పక్కనే ఉన్న దుకాణంలో ఓ కూల్డ్రింక్ను కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే మల్లంపెల్లి నుంచే వారిని ఒక ఆటో వెంటాడిందని, అందులోని వ్యక్తులు బాలికలను అపహరించి దాదాపు 15 రోజులపాటు బంధించి, తర్వాత నరికి చంపేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హాస్టల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు బాలికలకు తరచూ ఓ వ్యక్తి ఫోన్ చేసేవాడని తెలిసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి వార్డెన్ అలసత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబరు 23న ఇంటి నుంచి బయల్దేరి హాస్టల్కు వెళ్లిన బాలికలు చేరారో లేదో తెలుసుకునేందుకునవంబరు 24న వారి తల్లిదండ్రులు వార్డెన్ వీరమ్మకు ఫోన్ చేశారు.
ఆమె 26వ తేదీన గానీ ప్రియాంక, భూమిక హస్టల్కు రాలేదని సమాచారాన్ని అందించలేదు. దీంతో తమ పిల్లల ఆచూకీ కనిపెట్టాలంటూ వారు నవంబరు 27న హాస్టల్ ఎదుట ధర్నా చేశారు. తర్వాత పర్వతగిరి పోలీస్ స్టేషన్లో 28న ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఐటీడీఏ ఉన్నతాధికారులు నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచఎం అంజనమూర్తి, మ్యాట్రిన్ వీరమ్మలను బుధవారం సస్పెండ్ చేశారు. పీవో అమయ్కుమార్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications