కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం: తెలంగాణలో దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది తమ కుటుంబంలోని వ్యక్తులను కోల్పోయారు. భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వీరిని ఆదుకునేందుకు కేంద్రం రూ. 50 వేలు పరిహారంగా అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కరోనా మృతులకు పరిహారం చెల్లింపులకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కరోనా మృతుల కుటుంబసభ్యులకు రూ. 50 వేల పరిహారం చెల్లించనున్నారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి 30 రోజుల్లోపే పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పస్టం చేసింది. ఇందుకోసం మృతుల కుటుంబసభ్యులు.. ప్రభుత్వం పేర్కొన్న విధంగా అన్ని పత్రాలను ఆన్లైన్లోనే సమర్పించాలని ఉంటుంది.
దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారందరికీ జిల్లా కలెక్టర్ పరిహారం మంజూరు చేయనున్నారు. ఈ మొత్తం ఆధార్ లింక్ అయిన ఖాతాకు నేరుగా బదిలీ చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, కరోనా మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ -19తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్లను దాఖలయ్యాయి. ఈ క్రమంలో ప్రతి కరోనా మరణానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుల ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభమైంది. మీ సేవ ద్వారా మొదటి రోజే 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ..ఈ దరఖాస్తులను పరిశీలించి... కోవిడ్ డెత్ సర్టిఫికేట్లను జారీ చేయనుంది. మృతుల కుటుంబసభ్యులు పంచాయతీ లేదా... మున్సిపాల్టీ నుంచి డెడ్ సర్టిఫికేట్, కోవిడ్ పాజిటివ్ రిపోర్టును దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ రిపోర్టు లేకపోతే.. వైరస్ కారణంగా..అడ్మిట్ అయిన ఆస్పత్రి నుంచి మరణాన్ని ధృవపరిచే మెడికల్ సర్టిఫికేట్ను జత చేయాలి. లేదంటే, కరోనా చికిత్సలో చేసిన పరీక్షల బిల్లులు, ఇతరత్రా పేపర్లు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్, ధృవపత్రాలతో రూ. 50 వేల పరిహారం కోసం... ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.