గోదావరి పుష్కరాలు: భద్రాద్రి సిద్ధం, భక్తుల కోసం 20 లక్షలు లడ్డూలు..!
హైదరాబాద్: ఈనెల 14 నుంచి మొదలవనున్న గోదావరి పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. అయితే వరుణ దేవుడు మాత్రం కరుణించక పోవడంతో నీరు లేక గోదావరి వెలవెలబోతుంది. దీంతో పుష్కర ఘాట్లకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో పుష్కరాలు జరుగనుండగా, ఆయా జిల్లాలకు ప్రాజెక్టుల్లోని నీటిని మళ్లించాలని నిర్ణయించారు. అదే విధంగా నీటి విడుదల కోసం మహారాష్టత్రో చర్చిస్తున్నారు. మహారాష్ట్ర సానుకూలంగా స్పందించింది. అయితే నీటివిడుదలపై నిర్ణయం మహారాష్ట్ర తన నిర్ణయాన్ని శనివారం వెల్లడిస్తుంది.
యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పి, కడెం, ఎల్లంపల్లి నుండి పుష్కర ఘాట్లకు నీటిని మళ్లించాలని హరీశ్రావు అధికారులను ఆదేశించారు. తక్షణం దీనికి సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా జరుగుతున్న పుష్కరాలు కావడంతో కుంభమేళా తరహాలో భారీ ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు సైతం పెద్ద ఎత్తున పుష్కరాల్లో పుణ్యస్నానాలకు సిద్ధం అవుతుండగా, ఘాట్లలో నీరు లేవనే వార్తలు వారికి నిరాశ కలిగించాయి.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జిల్లా కలెకర్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాసరలో నీరు లేకపోవడంపై ప్రధానంగా చర్చించారు. నీటి మళ్లింపు కోసం మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది.
మున్సిపల్ అధికారులు, సానిటేషన్ అధికారులు వారికి కేటాయించిన పుష్కర ఘాట్ల వద్దకు చేరుకున్న విషయంపై వివరాలు తెలుసుకున్నారు. స్నానాల గదుల విషయంలో ఎక్కడా అశ్రద్ధ వహించరాదని సూచించారు. పుష్కర ఘాట్లను శుభ్రంగా ఉంచాలని, అధికారులు దీనిపై శ్రద్ధ చూపించాలని కోరారు. గత పుష్కరాలతో పోలిస్తే భక్తుల సంఖ్య ఈసారి నాలుగైదు రేట్లు ఎక్కువగా ఉంటుందని హరీశ్రావు తెలిపారు.
మరోవైపు గోదావరి పుష్కరాలకు భద్రాచలంలో అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గోదావరి మహాపుష్కరాలు స్వరాష్ట్రంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పుష్కరాల్లో పాల్గొనేందుకు 4 వేల మంది నాగ సాధువులు భద్రాచలం వస్తారని తెలిపారు. రాజమండ్రి కంటే భద్రాచలం పుష్కరాలకు ఎక్కువ భక్తులు వస్తారని చెప్పారు. పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
గోదావరి పుష్కరాలకు భద్రాది ఆలయం సిద్ధమైంది. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 20 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు ఆలయ అధికారులు. తానీషా కళ్యాణ మండపంలో లడ్డూల తయారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications