సినిమాలో అందరు తెలంగాణవాళ్లే: నాయిని సంతోషం, ప్రాజెక్ట్లపై కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ సినిమాలకు మంచి భవిష్యత్తు ఉందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి శుక్రవారం అన్నారు. ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ చాంబరులో ఇండియన్ పోస్ట్మాన్ సినిమా ఆడియో విడుదల చేశారు. దీనికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంపై సినిమా నిర్మించడం పట్ల దర్శకుడు రమేష్ రెడ్డి తుమ్మలను అభినందించారు. ఈ సినిమాలో పూర్తిగా తెలంగాణ కళాకారులు ఉండటం శుభసూచకమన్నారు.
చిన్న సినిమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. పూర్తిగా తెలంగాణ కళాకారులు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు.
ప్రాజెక్టులపై కెసిఆర్
పాలమూరు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతలను వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు రూ.300 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
ప్రాజెక్టుల విషయంలో సమస్యలు, అడ్డంకులను అధిగమించాలన్నారు. తక్కువ సమయంలో కృష్ణా జలాలను పొలాలకు పారించాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అంతర్రాష్ట్ర సమస్యలు తగ్గుతాయని చెప్పారు. నిర్వాసితుల పట్ల అత్యంత సానుభూతితో వ్యవహరించాలన్నారు.
భూ నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ కోసం నిర్వాసితులతో మాట్లాడాలన్నారు.