2026లో ఆ విమానాశ్రయానికి భూమిపూజ.. భారీ శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ల నిర్మాణం పైన అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించాయి. రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఈ శుభవార్త ఓరుగల్లు వాసులను సంతోష పెడుతుంది.
ఏ ఏ ఐ హైదరాబాద్ జిఎం బివి రావు బృందానికి భూమి అప్పగింత
ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి క్లియరెన్స్ వచ్చిందని భూసేకరణ చేసి అప్పగిస్తే ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల చెప్పి వెళ్లారు. ఇక తాజాగా శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జిఎం బివి రావు బృందానికి ప్రభుత్వం 223 ఎకరాల ప్రైవేటు భూమిని అప్పగించింది.

పూర్తయిన మామునూరు విమానాశ్రయ భూసేకరణ
గత కొద్దిరోజులుగా 223 ఎకరాల భూమిని సేకరించి, ఆర్బిట్రేషన్ ద్వారా వారికి ఇవ్వవలసిన పరిహారాన్ని అందించి యుద్ధ ప్రాతిపదికన భూమిని సేకరించారు. ఇక ఈ భూమిని ఏ ఏ ఐ కి అప్పగించారు. గతంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం 696 .14 ఎకరాల భూమి సేకరించగా, ప్రస్తుతం 223 ఎకరాలతో కలిపి మొత్తం దాదాపు 950 ఎకరాల వరకు భూసేకరణ జరిపారు. ఈ భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తయ్యింది.
జనవరిలో భూమిపూజ చేసే అవకాశం
2026 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేసి మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2027 చివరి నాటికి విమాన సేవలు లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ విమానాశ్రయంలో ప్రారంభంలో చిన్న విమానాలను నడపాలని ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి దూర ప్రాంతాలకు కూడా సర్వీసులను పెంచుతామని ఇప్పటికే కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో మరో కీలక అడుగు
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పునరుద్దరిస్తున్న ఈ విమానాశ్రయం త్వరితగతిన అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్ తరహాలో చాలా స్పీడ్ గా దీనిని నిర్మాణం చేయాలని,కొచ్చిన్ విమానాశ్రయ తరహాలో నిర్మాణం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భూసేకరణ పూర్తిచేసి భూమిని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మరో కీలక అడుగు పడినట్లు అయింది.












Click it and Unblock the Notifications