సంచలనమేమీ లేదు: రాజ్నాథ్ భేటీపై గవర్నర్, మంత్రి తలసాని వ్వవహారంపైనా..!
హైదరాబాద్: ఒక గవర్నర్గానే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశానని, ఇందులో ఎలాంటి సంచలనం... అద్భుతం లేదని చెప్పారు. హోం మంత్రితో భేటీ సాధారణ సమావేశమేనని, ఇందులో చెప్పడానికి ఏమీ ప్రత్యేకత లేదన్నారు.
గురువారం సాయంత్రం హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్తో 15 నిమిషాలు, ఆ తర్వాత హోం మంత్రి రాజ్నాథ్తో 20 నిమిషాల పాటు నరసింహన్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని హమీలు, షెడ్యూల్ 9,10లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తాను నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమానికి ఇరురాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్లు గైర్వాజరైన విషయాన్ని రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని విద్యాసంస్ధల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఇక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్వవహారాన్ని సరైన సమయంలో పరిష్కరిస్తామని (వెన్ బ్రిడ్జ్ కమ్స్ వియ్ క్రాస్ ఇట్) అని గవర్నర్ నరసింహాన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించి సంతాపం తెలియజేశారు.