మరోమారు గవర్నర్ తమిళిసై సంచలనం.. తగ్గేదేలేదంటూ ప్రభుత్వం, కేసీఆర్పై విమర్శల వర్షం!!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గౌరవం ఇవ్వకపోతే ఎవరినీ లెక్క చేయబోనని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేల్చిచెప్పారు. గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని, గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కింది
ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వరంగల్ పర్యటనలో తనను అవమానించారని పేర్కొన్న తమిళిసై, మేడారం వెళ్లడానికి హెలికాఫ్టర్ కావాలని కోరానని, కానీ ప్రభుత్వం చివరి నిమిషం వరకు ఏమీ తేల్చలేదని, ఎనిమిది గంటలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసి ఆదివాసి దేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నానని, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేశారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తానని రాకపోవడం కరెక్టేనా అంటూ గవర్నర్ తమిళి సై ప్రశ్నించారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలని తమిళిసై పేర్కొన్నారు.

తాను వరద ప్రాంతాలలో పర్యటించటం వల్లే కొందరు అక్కడకు వచ్చారు
విద్యార్థులు యూనివర్సిటీలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదని తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. గవర్నర్ గా తాను ఎక్కడికైనా వెళ్లొచ్చు అని ఆమె పేర్కొన్నారు. తాను వరద ప్రాంతాలలో పర్యటించటం వల్ల కొందరు అక్కడికి వచ్చారని తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. అయినప్పటికీ తాను తన పని చేసుకొని పోతానని తమిళిసై పేర్కొన్నారు.

తన మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బ తీయలేరని చెప్పిన తమిళిసై
తన జీవితం ప్రజల కోసమేనని పేర్కొన్న తమిళిసై, తన పరిధి ఏంటో తనకు తెలుసని వ్యాఖ్యలు చేశారు. తన మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయ లేరని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, చాలా అవమానాలు భరించానని చెప్పుకొచ్చారు. తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని, రాజ్ భవన్ ను గౌరవించాలని సూచించారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

మహిళను అవమానించారన్నది చరిత్రలో ఉండరాదన్న తమిళి సై
రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచి పెట్టామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. రాజ్ భవన్ లో మహిళా దర్బార్ ఏర్పాటు చేసి మహిళల సమస్యలను తెలుసుకున్నాం అని చెప్పిన ఆమె, వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మహిళను అవమానించారన్నది తెలంగాణ చరిత్రలో ఉండకూడదని తన అభిప్రాయమని తెలిపారు గవర్నర్ తమిళిసై.












Click it and Unblock the Notifications