తెలంగాణ గవర్నర్ తమిళిసై మార్పు..?!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారశైలి పట్ల బీజేపీ నాయకులు అసంతృప్తితో ఉన్నారని, ఆమెను మార్చవచ్చని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు స్థాన చలనం సంభవించబోతోందా?, ఆమె వ్యవహార శైలి, పనితీరు పట్ల భారతీయ జనతా పార్టీ నాయకుల్లో అసంతృప్తి మొదలైందా?, అధికార భారత్ రాష్ట్ర సమితితో సయోధ్య కుదుర్చుకోవడం వారిని అసహనానికి గురి చేస్తోందా?- అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమెను తప్పిస్తారని, గవర్నర్ ను మార్చుతారనే ప్రచారం ఊపందుకుంది.
ఘర్షణకు పుల్ స్టాప్..
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్- ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధానికి దాదాపుగా తెర పడినట్టేననే అభిప్రాయాలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విషయం తెలిసిందే. గవర్నర్ తో కేసీఆర్ ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుందని, ఇందులో భాగంగానే ఆమెపై హైకోర్టులో వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకుందనే అంచనాలు వెలువడ్డాయి.
పిటీషన్ వెనక్కి..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రతిపాదనలపై గవర్నర్ సంతకం చేయలేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళిసైపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించేలా గవర్నర్ కార్యాలయాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించిన కొన్ని గంటల్లోనే దాన్ని ఉపసంహరించుకుంది.
గవర్నర్ ను కలుసుకున్న మంత్రులు..
అంతకుముందు- గవర్నర్ వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకున్న తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్ భవన్కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. మర్యాదపూరకంగా ఆమెతో భేటీ అయ్యారు. దీనితో గవర్నర్- ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణానికి తెరదించినట్టయింది.
ప్రభుత్వంపై ప్రశంసలు..
ఆ తరువాత అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందంటూ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన ఆమె ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తోందనీ కితాబిచ్చారు. సంక్షేమ పథకాలను ఆమె ప్రస్తావించారు.
బీజేపీలో అసంతృప్తి..
ఈ పరిణామాలన్నీ బీజేపీ నేతలను అసహనానికి గురి చేశాయని, ఆమె వ్యవహార శైలి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్ కు మధ్య రాజీ కుదిరినట్టుందని, అసెంబ్లీలో ఆమె ప్రసంగాన్ని చూస్తే అది స్పష్టమౌతోందని అన్నారు. గవర్నర్ మరో మార్గం లేక అలా ప్రసంగించి ఉండొచ్చని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని చెప్పారు.
తమిళిసైని మార్చొచ్చు..
అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుల్లో అసంతృప్తి నెలకొని ఉందని జగ్గా రెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్లు తమిళిసైని మార్చొచ్చని అభిప్రాయపడ్డారు. తనకు సొంత పార్టీ కంటే బీజేపీ చరిత్రే బాగా తెలుసునని, అందుకే తాను ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. కేసీఆర్ కిట్ వల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు.