ఆ హత్యపై నివేదిక ఇవ్వండి - ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఆదేశం..!!
సంచలనంగా మారిన నాగరాజు హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యకు గురవ్వటం పైన పూర్తి నివేదిక కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్లోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు..పోతిరెడ్డిపల్లెకు చెందిన యువతి రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు.
మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఆశ్రిన్ సుల్తానా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్ సిటీ లాల్దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తొలుత బాలానగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పెళ్లికి మునుపు వికారాబాద్ పోలీసులను.. పెళ్లి తర్వాత బాలానగర్ పోలీసులను ఆశ్రయించారు.
నాగరాజు మలక్పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్మన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్పై వీఎం హోం నుంచి సరూర్నగర్ పోస్టాఫీస్ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్పై వచ్చిన దుండగులు బైక్ను ఆపారు. యువకుడి హెల్మెట్ను తీయించి సెంట్రింగ్ రాడ్తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.
నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. ఇక, హత్య పైన సంచలనంగా మారటంతో..ఇప్పుడు గవర్నర్ సైతం ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.