గవర్నర్పై నిందా?: చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై నరసింహన్ అసంతృప్తి!
అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఈ వ్యవహారం గవర్నర్ మెడకు చుట్టుకుంది. తప్పంతా ఆయనదే అన్నట్లు ప్రచారం జరిగింది. గవర్నర్ సరైన చొరవ చూపించకపోవడం.. అంతగా శ్రద్ద పెట్టకపోవడం మూలంగానే ఈ దుస్థితి నెలకొందన్న వాదన ఉ
హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నా.. విభజన సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. సమస్యల పరిష్కరానికి ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు గవర్నర్ సమక్షంలో మూడుసార్లు భేటీ అయినప్పటికీ.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలపై గవర్నర్ నరసింహన్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రుల స్థాయి కమిటీలతో భేటీలో ఈ విషయం స్పష్టమైంది. ఇకపై మంత్రుల స్థాయి కమిటీ సమావేశాలు వద్దని, సీఎంలు ఇద్దరూ స్వయంగా హాజరైతేనే తదుపరి చర్యల్లో గవర్నర్ పాల్గొంటారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
సీఎంలిద్దరూ గతంలో మూడుసార్లు భేటీ అయినా.. ఒక్క నిర్ణయం కూడా కార్యరూపం దాల్చకపోవడం పట్ల గవర్నర్ అసహనంతో ఉన్నారు. తాజాగా రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న విద్యుత్ పంచాయితీలపై కూడా గవర్నర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలు పోటీ పడి మరీ లేఖాస్త్రాలు సంధించుకోవడం.. కరెంటు నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేయడాన్ని గవర్నర్ తప్పుపడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక సచివాలయం విషయానికొస్తే.. అందులోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించే విషయంపై ఇటీవల ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపినా.. అదీ ఓ కొలిక్కి రాలేదు.విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్ లోని సంస్థల విభజనపైనా ఎలాంటి కదలిక లేదు. దీంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది.
'అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఈ వ్యవహారం గవర్నర్ మెడకు చుట్టుకుంది. తప్పంతా ఆయనదే అన్నట్లు ప్రచారం జరిగింది. గవర్నర్ సరైన చొరవ చూపించకపోవడం.. అంతగా శ్రద్ద పెట్టకపోవడం మూలంగానే ఈ దుస్థితి నెలకొందన్న వాదన ఉంది'. దీంతో గవర్నర్ మరింత అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. ఈ సమస్యలకు మున్ముందు ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారో!
కాగా, గవర్నర్ తో సమావేశానికి విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి అంశాలపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన త్రిసభ్య కమిటీ సభ్యులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, వివేక్, ఆంధ్రప్రదేశ్కు చెందిన త్రిసభ్య కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, అచ్చెయ్యనా యుడు, కాల్వ శ్రీనివాస్లు హాజరైనట్లు సమాచారం.