ఇంటర్ తో మంటగలిసిన ప్రతిష్ట..! కేసీఆర్ ప్రభుత్వాన్ని గోతిలో పడేసిన గ్లోబరీనా..!!
హైదరాబాద్ : తెలంగాణలో వారం పదిరోజులుగా రగులుతున్న ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇంటర్ వ్యవహారం తెలంగాణ లోని రాజకీయ పార్టీల మద్య ఐక్యతా రాగాన్ని కూడా ఆలపిస్తోంది. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు, కాంగ్రెస్, బీజేపి, టీడిపి, జనసేన, జనసమితి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇంటర్ వ్యవహారాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఏకంగా అమరణదీక్షకు దిగినట్టు ప్రకటించారు. అయితే.. పోలీసులు అరెస్టు చేయటంతో అది ఆసుపత్రిలో కొనసాగిస్తున్నట్లు లక్ష్మణ్ ప్రకటించారు. అంతే కాకుండా అన్ని పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై ముప్పేట దాడికి ఉపక్రమిస్తున్నాయి.
ఇంటర్ కలిపిన బంధం..! ఏకమవుతున్న ప్రతిపక్షాలు..!!
జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. వి.హనుమంతురావు, గీతారెడ్డి, ఉత్తమ్ వంటి హస్తం సీనియర్లు కూడా ప్రజాపక్షాన ఉండాలని తపనపడుతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు తారుమారుకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే.. అది కంటితుడుపు చర్యగా మారుతుందా.. కఠినంగా ఉంటుందా అనే అంశం పై అనేక సందేహాలు నెలకొన్నాయి.
గులాబీ ప్రభుత్వం పై ముప్పేట దాడి..! పుంజుకుంటున్న ప్రతిపక్షాల బలం..!!
ఫలితాల విడుదల వల్ల పరీక్ష ఫెయిల్ ఐన దాదాపు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు మరణించిన కుటుంబ సభ్యులను కూడా ఉద్యమంలోకి ఆహ్వానించటం ద్వారా విపక్షాలు గులాబీపార్టీపై మరింత ఒత్తిడి పెంచాలనే యోచనలో ఉన్నాయి. అదే జరిగితే.. యావత్ తెలంగాణ నుంచి అనూహ్య స్పందన వస్తుందని.. మరోసారి తెలంగాణ ఉద్యమంనాటి పరిస్థితులను చూడాల్సి ఉంటుందనే భయం కూడా గులాబీ బాస్లో నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురవబోతున్నాయనే విషయం చంద్రశేఖర్ రావును కలవరపాటుకు గురిచేస్తోందనే చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బందే..! జోరు తగ్గనున్న కారు వేగం..!!
16 సీట్లలో ఏ ఒక్కసీటు తగ్గినా జాతీయస్థాయిలో చంద్రశేఖర్ రావు నాయకత్వంపై నీలినీడలు కమ్ముకుంటాయనే ఆందోళన కూడా గులాబీశ్రేణుల్లో ఉంది. స్థానిక ఎన్నికల్లో అధిక శాతం పోటీలేకుండా యునాననిమస్గా గెలవాలని గులాబీపార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నయానా.. భయానా నచ్చజెప్పి ఏకగ్రీవం చేసుకోవం ద్వారా తమ బలాన్ని క్షేత్రస్థాయిలో పెంచుకోవాలనేది గులాబీ పార్టీ ప్రణాళికగా తెలుస్తోంది.
ప్రతిపక్షాలకు మంచి ఆయుధం ఇచ్చిన ఇంటర్..! కేసీఆర్ ను ఇరుకున పెడుతున్న కాంగ్రెస్..!!
ఇటువంటి సమయంలో ఇంటర్ తో చెలరేగిన సంక్షోభం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారటాన్ని కూడా గులాబీనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తాము ఏ మాత్రం ఏకగ్రీవం చేసుకోకుండా, ప్రజావ్యతిరేకత వల్ల కాంగ్రెస్ లాభపడుతుందనే భయం కూడా గులాబీ పార్టీలో కనిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో విపక్షాలు కూడా ఇంటర్ రచ్చను, వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లి చంద్రశేఖర్ రావు నాయకత్వంపై అనుమానాలను రేకెత్తించాలనే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదే జరిగితే చంద్రశేఖర్ రావు మున్ముందు మరిన్ని తలనొప్పులు చవిచూడాల్సి వస్తుందని గులాబీ నేతలు మదనపడుతున్నట్టు తెలుస్తోంది.