శీతాకాల విడిది కోసం నగరానికి రాష్ట్రపతి: ఘన స్వాగతం పలికిన గవర్నర్, కేసీఆర్
హైదరాబాద్: శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
గవర్నర్ నరసింహన్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రాష్ట్రపతి 14రోజుల పాటు హైదరాబాద్లో బస చేయనున్నారు.
హకీంపేట నుంచి ఆయన నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు.సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు.
రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన షెడ్యూల్:
19వ తేదీన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో నిర్వహించనున్న స్నాతకోత్సవానికి హాజరవుతారు. 20, 21 తేదీల్లో రాష్ట్రపతి భవన్ లోనే గడుపుతారు. 22వ తేదీన బెంగుళూరుకు వెళతారు.
23 తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ ఆన్యువల్ కాంగ్రెస్కు హాజరవుతారు. సీఎం కేసీఆర్ నిర్వహించే చండీ యాగానికి 27వ తేదీన హాజరవుతారు.
తిరిగి 31వ తేదీ ఉదయం 11 గంటలకు హాకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. రాష్ట్రపతి విడిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం ప్రాంగణానికి అవసరమైన అన్ని సౌకర్యాలనూ రక్షణశాఖకు చెందిన ఎంఈఎస్ ద్వారా కల్పిస్తున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కోర్టుకు హాజరవుతారు: వీహెచ్
న్యాయవ్వవస్థపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లు కోర్టుకు హాజరవుతారని తెలిపారు. సోనియా, రాహుల్కు అండగా ఉంటామని వీహెచ్ స్పష్టం చేశారు.