నిన్న కరక్కాయ.. నేడు వేరుశనక్కాయ.. మరో మల్టీ లెవెల్ మోసం
హైదరాబాద్ : కాదేదీ మోసానికి అనర్హమన్నట్లుగా తయారయ్యారు మోసగాళ్లు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతూ కోట్లు కూడబెడుతున్నారు. ప్రతినిత్యం మోసాల కథలు వెలుగుచూస్తున్నా.. జనాల్లో మాత్రం అవగాహన పెరగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు అంటూ ఆశచూపే మోసగాళ్లను గుడ్డిగా నమ్ముతున్నారు. వేలు, లక్షలు పెట్టుబడులుగా పెడుతున్నారు. మల్టీ లెవెల్ స్కీముల్లో మహా మోసం దాగి ఉందని తెలిసినా.. కథ మళ్లీ మొదటికే వస్తోంది. తీరా చేతులు కాలాక లబోదిబోమంటున్నారు.
నూనె, పిప్పి.. జనాలకు కుచ్చుటోపి
టెక్నాలజీ పెరిగి అరచేతిలోకి ప్రపంచం వచ్చినా.. ఇంకా మోసపోతూనే ఉన్నారు పబ్లిక్. పల్లికాయల పేరుతో జనాల సొమ్ముకు ఎసరు పెట్టింది గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ. గ్రీన్, గోల్డ్ అంటూ సంస్థ పేరులో పచ్చదనం కనిపిస్తున్నా.. లోపల మాత్రం అంతా మాయే. పల్లీలు మావే, మిషన్ మాదే.. మీరు చేయాల్సిందల్లా నూనే తీసి మాకు అమ్మడమే అంటూ ప్రకటనలు అదరగొట్టారు నిర్వాహకులు. నూనె తీయగా వచ్చే పిప్పిని కూడా వదిలిపెట్టం, అది కూడా కొంటామంటూ జనాలను ఆశల పల్లకిలో ఊరేగించారు.
అదంతా నిజమని తమ దగ్గరకు వచ్చేవారికి అసలు కథ వినిపించేవారు. సంస్థ లాభాల్లో నడుస్తోందని, తమతో కలిసి వస్తే మీకు ప్రయోజనాలు ఉంటాయని నమ్మించారు. డిపాజిట్లు, స్కీములు, చైన్ లింకుల పరమ పద సోపానాలు... ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు. నెలనెలా 5 వేల రూపాయలు కడితే రెండేళ్లలో 20 లక్షలు మీ సొంతమంటూ ఊరించారు. అంతేకాదు లక్షకు 10వేలు, 2 లక్షలకు 20వేల రూపాయలు ఇస్తామంటూ భారీమొత్తంలో డిపాజిట్లు సేకరించారు.
వేల సంఖ్యలో బాధితులు.. కోట్లు వసూలు
హైదరాబాద్ లోని ఉప్పల్ కేంద్రంగా సాగిన ఈ సంస్థ కార్యకలాపాలు తక్కువ సమయంలో రాష్ట్ర సరిహద్దులు దాటాయి. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా కోట్లల్లో సొమ్ము వసూలు చేశారు. వేల సంఖ్యలో బాధితులున్నట్లు తెలుస్తోంది. జనాలను నమ్మించడానికి బాండు పేపర్లను అస్త్రంగా వాడుకున్నారు. బాండ్ పేపర్ ఒప్పందం అనేసరికి చాలామంది ఈ సంస్థను గుడ్డిగా నమ్మారు.
పల్లీల నుంచి తీసిన నూనెను లీటర్ 35 రూపాయల చొప్పున కొంటామని, పిప్పిని కిలో 20 రూపాయల చొప్పున తీసుకుంటామని అగ్రిమెంట్లు రాసి ఇచ్చారు నిర్వాహకులు. అంతేకాదు డిపాజిట్ల కింద తీసుకున్న డబ్బులకు సైతం ఎంత తిరిగి చెల్లిస్తామనేది బాండ్లు రాసి ఇచ్చారు. కార్లు, విదేశీ టూర్లంటూ చైన్ లెవెల్ మార్కెటింగ్ తో జనాలకు వల విసిరారు.
గతంలోనూ మల్టీ మోసాలు
హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన ఓ వ్యాపారి భార్య... గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ జిన్నా శ్రీకాంత్ ను కలిశారు. ఆయన సూచన మేరకు మేనేజర్ భాస్కర్ యాదవ్ తో మాట్లాడి లక్ష రూపాయలు చెల్లించారు. ఆ మేరకు అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చారు నిర్వాహకులు. అయితే నెల గడిచాక... ఇస్తామన్నా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. దీంతో విసిగిపోయిన ఆ వ్యాపారి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడంతో గ్రీన్ గోల్డ్ గొలుసు కట్టు డొంక కదిలింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిజామబాద్ జిల్లాకు చెందిన ఆ సంస్థ యజమాని శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. అతడిపై గతంలోనూ చైన్ లెవెల్ మార్కెటింగ్ కేసులున్నట్లుగా తెలుస్తోంది.