జీఎస్టీ రిటర్న్ ల దాఖలుకు గడువు పొడిగింపు, ఖాదీ వస్తువులకు మినహాయింపు: అరుణ్ జైట్లీ
భాగ్యనగరంలోని హెచ్ఐసీసీలో శనివారం జరిగిన జీఎస్టీ మండలి భేటీ ముగిసింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని హెచ్ఐసీసీలో శనివారం జరిగిన జీఎస్టీ మండలి 21వ భేటీ ముగిసింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన జీఎస్టీ మండలి సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థికశాఖ మంత్రులతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర, కేంద్రం దృష్టికి వచ్చిన అంశాలను చర్చించారు. గతంలో ఏకాభిప్రాయం కుదరని విషయాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ... జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేయడానికి అక్టోబర్ 10 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, తాత్కాలిక పన్నుల కింద ఐజీఎస్టీ ఉపయోగించుకున్నారని అన్నారు.
చిన్న కార్లపై అదనపు భారం పడకుండా చూడాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. వాటిపై జీఎస్టీ 48 నుంచి 43 శాతానికి దిగి వచ్చిందని చెప్పారు. పెద్ద కార్లపై సెస్ 5 శాతం పెరిగిందని, స్పోర్ట్స్ కార్లపై 7 శాతం పెరిగిందని అన్నారు. 1200 సీసీ పెట్రోల్, 1500 సీసీ డీజిల్ కార్లపై యథాతథ స్థితి ఉంటుందని చెప్పారు.
ఖాదీ వస్తువులకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావు తరుపున శనివారం రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ లో జరగనున్న విందు కార్యక్రమంలో జీఎస్టీ మండలి పాల్గొననుంది.