చంద్రబాబుకు మరో షాక్: టిఆర్ఎస్లోకి గుండు సుధారాణి?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారు.
వరంగల్ జిల్లాకు చెంది రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టిఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. వరంగల్ లోకసభకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సుధారాణి టిఆర్ఎస్ వైపు చూడడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చే పరిణామమే.
వరంగల్ జిల్లాకు చెందిన పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సుదీర్ఘ కాలంలో టిడిపిలో పనిచేస్తూ వచ్చిన సుధారాణికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనం కోసం ఆమె టిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వరంగల్ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలతో ఆమెకు విభేదాలున్నాయి. గతంలో ఓ నాయకుడితో బహిరంగ ఘర్షణ చోటు చేసుకుంది. టిడిపిలో ఆమె ఇమడలేకపోతున్నారని, దీంతో టిఆర్ఎస్లో చేరాలని ఆమె ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ఈ నెలాఖరులోగా ఆమె టిడిపిలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.