'కేసీఆర్ గురించి విజయశాంతికి ఆ రోజు గుర్తురాలేదా, ఈ విషయంపై స్టాండ్ ఏమిటి'
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్ విజయశాంతికి తెరాస మహిళా నాయకురాలు గుండు సుధారాణి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలపై విమర్శలు, వారిని దొరలుగా సంభోదించడాన్ని తప్పుబట్టారు.
కేసీఆర్కు గతంలో రాఖీ కట్టిన సమయంలో విజయశాంతికి దొర అన్న పదం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడితే కాంగ్రెస్ పార్టీ దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారన్నారు.
బతుకమ్మ చీరలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, ఈ విషయంలో విజయశాంతి తన స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తాగునీరు, సాగునీరు కోసం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కోర్టుల్లో కేసులు వేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలు సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అని నిప్పులు చెరిగారు.
కాగా, గురువారం రోజు గద్వాలలో కేసీఆర్ పైన విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒసేయ్ రాములమ్మ సినిమాలో రామిరెడ్డిలా ఆయన స్థానంలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నారని విజయశాంతి దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ వేరు, ఇప్పుడు ఉన్న కేసీఆర్ వేరు అన్నారు. సమైక్యవాదులతో కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ వచ్చింది ఎస్సీ, ఎస్టీలకు కాదు దొరలకే అన్నారు.
తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం నాలుగేళ్లుగా మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి తనను ముఖ్యమంత్రిని చేస్తే తెరాసను విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని, ఆయన విజ్ఞప్తికి సోనియాగాంధీ ఒప్పుకోలేదని చెప్పారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నాలుగున్నర ఏళ్లకే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారని, వారి నుంచి డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలన్నారు.