దేశంలో గవర్నర్ల వ్యవస్థ భ్రష్టు పట్టింది; అసెంబ్లీ రద్దుపైనా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారంటే!!
గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈరోజు నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ బ్రష్టు పట్టిందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన ఆయన ఎవరైనా సరే గౌరవాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

గవర్నర్ ఇప్పటివరకు ఏడు బిల్లులు ఆపారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
ఇప్పటివరకు గవర్నర్ 7 బిల్లులు ఆపారని ఆరోపణలు గుప్పించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, బిల్లులు ఆపుకుంటూ పోతే అభివృద్ధి ఎలా జరుగుతుందంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లును కూడా ఆపారని అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ బ్రష్టు పట్టిపోయిందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రంపై పోరాటం మొదలైంది అన్నారు. గవర్నర్ ప్రభుత్వంతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని, కానీ అలా పని చేయడం లేదన్నారు.

బీజేపీ తొమ్మిదేళ్ళ పాలనలో చేసింది ఇదే
దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు,లౌకిక వాద శక్తుల ఏకీకరణకు ఖమ్మం బహిరంగ సభ దోహదం చేసిందనితెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే దురుద్ధేశంతోనే బీజేపీ విమర్శలు చేస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ తొమ్మిదేళ్ళ పాలనలో పేద ప్రజలపై భారంతో పాటు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసిందని ఆరోపించారు. నిజాం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టారని, కానీ బిజెపి పాలనలో ప్రైవేటీకరణలు తప్ప ప్రజలకు మేలు చేకూరలేదన్నారు.

ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు వ్యాఖ్యల్లో అర్ధం లేదు
హైదరాబాద్లో నిజాం ఆఖరి వారసుడి అంత్యక్రియల పై కూడా రాజకీయాలు చేయడం దుర్మార్గమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రోటోకాల్ విషయంలో అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పటంలో అర్థం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమ కుండే గౌరవాన్ని కాపాడుకోవాలని...చట్టసభల్లో పెట్టే బిల్లులు ఆమోదించకుండా ప్రోటోకాల్ పాటించడం లేదనడంలో అర్ధం లేదని అన్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తారన్న రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదని... .జనవరి 31 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మార్చిలోపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇవి కాకుండానే అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ దుష్ప్రచారాలని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఖమ్మం సభలో కేసీఆర్ వ్యాఖ్యలతో మొదలైన కొత్త వివాదం
కొంతకాలంగా ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య చోటు చేసుకున్న అగాధం తాజాగా ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో మళ్లీ దుమారం రేపింది. దీనిపై స్పందించడానికి నిరాకరించిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదంటూ, ప్రభుత్వం పంపిన బిల్లులు తాను ఇంకా అధ్యయనం చేస్తున్నానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా గవర్నర్ల వ్యవస్థ పై వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications