శిరీష-ప్రభాకర్ రెడ్డి కేసులో సగం క్లారిటీ ఇదీ: దర్యాప్తులో రాజీవ్ నోరు విప్పితేనే నిజాలు?
ఇప్పటిదాకా అందుతున్న ప్రాథమిక సమాచారం మేరకు తాను పనిచేస్తున్న సంస్థలో సహోద్యోగినితో విభేదాలే శిరీష అనుమానస్పద మృతికి కారణమన్న వాదన వినిపిస్తోంది.
హైదరాబాద్: కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి.. బ్యుటీషియన్ శిరీషల ఆత్మహత్యలు.. తొలుత వేర్వేరుగా భావించినప్పటికీ.. రెండింటికి లింకు బయటపడటంతో.. ఈ మిస్టరీ వెనుక కారణాలేంటా? అన్న సందేహాలు మొదలయ్యాయి. సవాలక్ష సందేహాలు వెంటాడుతున్న ఈ కేసులో.. ఇప్పటివరకు అందిన సమాచారం ఎలాంటి స్పష్టతనివ్వలేకపోయింది.
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చివరి మాటలివే: శిరీష, ప్రభాకర్ల మృతిపై ఎన్నో అనుమానాలు
వివాహేతర సంబంధమా? లేక ఆఫీసులో గొడవలా?.. అసలు రాజీవ్, శ్రవణ్ లతో కలిసి శిరీష కుకునూర్ పల్లి ఎందుకు వెళ్లింది? వంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం దొరకలేదు. శిరీష భర్త సతీష్ చంద్ర మాత్రం వివాహేతర సంబంధంపై వస్తున్న వార్తలను చూసి బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
వ్యాన్ తగలబెట్టి:
మరోవైపు అటు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సన్నిహితులు సైతం వివాహేతర సంబంధం వాదనను ఖండిస్తున్నారు. ఇదే అనుమానాలను వెలిబుచ్చిన ఓ ప్రముఖ టీవి ఛానెల్ ఓబీ వ్యాన్ ను సైతం ప్రభాకర్ రెడ్డి అనుచరులు తగలబెట్టారు. దీంతో ఈ కేసు పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అనివార్యత ఏర్పడింది.
శిరీషతో రాజీవ్ చనువుగా ఉంటున్నాడని?
ఇప్పటిదాకా అందుతున్న ప్రాథమిక సమాచారం మేరకు తాను పనిచేస్తున్న సంస్థలో సహోద్యోగినితో విభేదాలే శిరీష అనుమానస్పద మృతికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ఫిలింనగర్ పరిధిలోని ఆర్జీఏ స్టూడియో యజమాని రాజీవ్ కు చెందిన ఓ సంస్థలో శిరీష హెచ్ఆర్ గా పనిచేస్తోంది. రాజీవ్ కు అప్పటికే తేజస్విని అనే గర్ల్ ఫ్రెండ్ ఉండగా.. ఇటీవల శిరీషతో చనువుగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానం ఆమెలో మొదలైంది.
శిరీషతో రాజీవ్ వ్యవహరశైలికి నొచ్చుకున్న తేజస్విని.. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని కలత చెందింది.దీంతో రాజీవ్-శిరీష-తేజస్వినిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సమస్యకు ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని రాజీవ్ భావించాడు. ఇదే విషయమై మరో మిత్రుడు శ్రావణ్ ను సంప్రదించాడు.
ఎస్ఐ ఇలా ఎంటరయ్యాడు?:
ఆపై కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సీన్ లోకి ఎంటరయ్యాడు. రాజీవ్, శ్రవణ్ లు ప్రభాకర్ రెడ్డిని సంప్రదించడంతో.. విషయం సెటిల్ చేయడానికి కుకునూర్ పల్లిని అడ్డాగా ఎంచుకున్నారు. ఇదే క్రమంలో శిరీష, రాజీవ్, తేజస్విని, శ్రావణ్ కలిసి హైదరాబాద్ కు 71కి.మీ దూరంలో ఉన్న కుకునూర్ పల్లికి చేరుకున్నారు. అక్కడ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో కలిసి పార్టీ చేసుకున్నారు.
ఈ సందర్భంగా తలెత్తిన భేదాభిప్రాయాలతో.. తాను ఉన్న లొకేషన్ను హైదరాబాద్ లో ఉన్న భర్త సతీష్ చంద్రకు శిరీష షేర్ చేసింది. ఇదే క్రమంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. గొడవ పెద్దదయ్యేలా ఉండటంతో.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
అక్కడే మలుపు.. రాజీవ్ నోరు విప్పితేనే!:
ప్రభాకర్ రెడ్డి సూచనతో వీరంతా నేరుగా ఫిలింనగర్ లోని స్టూడియో వద్దకు చేరుకోగా.. కారు దిగీ, దిగగానే శిరీష లోపలికెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. కోపంలో అలా చేసిందేమో అని రాజీవ్, శ్రవణ్ భావించారు. కానీ శిరీష చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించడంతో కథ మరో మలుపు తిరిగింది.
శిరీష ఆత్మహత్య జరిగిన రోజే అటు ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నా.. ఈ రెండు వేర్వేరు సంఘటనలుగా కనిపించాయి. కానీ ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి ఈ రెండు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లు నిర్దారణ అయింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న శ్రవణ్, రాజీవ్ లు నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.