'కవితా! హైదరాబాద్ ఆదాయం ఏం చేస్తున్నారు', 'గెలిచినా మేం బానిసలుగానే'
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు కేంద్రమంత్రి హన్సరాజ్ గంగారాం బుధవారం నాడు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిలకు కేంద్రం వద్ద పరపతి ఉంటే రూ.20 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి తేవాలని, అప్పుడు నేను కూడా బిజెపికి ఓటేస్తానని కవిత అన్నారు.
ఆమె వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి హన్సరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారని నిలదీశారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే, మీరు కమిషన్లు తీసుకుని వెనకేసుకుంటారా? అని గట్టిగా ప్రశ్నించారు. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు.
పురుషులతో సమానంగా మహిళలు రాణించాలి: కవిత
కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాజకీయపరంగా రిజర్వేన్లు కల్పించినా, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా మహిళలం బానిసలుగానే ఉంటున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం, మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రీబాయి పూలే జయంతిని నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 282 మంది మహిళా ఎంపీపీలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కవిత మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా విద్యను అభ్యసించి రాణిస్తున్నప్పటికీ మహిళలకు ఇంకా పూర్తి స్వేచ్ఛ లభించలేదన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను మానేస్తున్న విద్యార్థులను గుర్తించి వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహిళా ఎంపీపీలు కృషి చేయాలని ఎంపీ కవిత సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎంపీపీలకు నిధులు సమకూరేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమానికి మాజీ కేంద్రమంత్రి హాజరైన జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... సావిత్రీబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు సమాజాభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పూలే దంపతులకు సరైన ప్రాచూర్యం దొరకలేదన్నారు.
తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ... రాజ్యాంగపరమైన హక్కులతో మహిళలు పతాకస్థాయికి చేరుకుంటున్నారన్నారు. మనకున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ హక్కులను సాధించుకునే ప్రయత్నం చేయాలన్నారు.