పారిపోతున్నారు: పవన్ కళ్యాణ్, బాబులపై హరీశ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో దగ్గరుండి నిలబెట్టిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయన తరపున ప్రచారం చేయకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
గురువారం తెలంగాణ భవన్లో తెలుగుదేశం నేత, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గి మల్లేశం తన అనుచరులతో కలిసి హరీశ్ రావు, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాములు నాయక్ల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు దమ్ముంటే మెదక్ ఉప ఎన్నిక ప్రచారానికి రావాలన్నారు. సీటు ఇప్పించినవాళ్లు ప్రచారానికి రాకుండా పారిపోతున్నారని ఆరోపించారు. మెదక్ లోకసభ పరిధిలో టిడిపి, బిజెపి నేతలు కనీసం చంద్రబాబు బొమ్మ పెట్టుకోవడానికి భయపడుతుతున్నారని అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నర్సాపూర్లో సునీతాలక్ష్మారెడ్డిలు పదేళ్లు అధికారం ఉండి ప్రజలను పట్టించుకోలేదని, అందుకే వారిని ప్రజలు తిరస్కరించారని చెప్పారు.
మెదక్ ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి నేత రేవంత్ రెడ్డి తన బతుకుదెరువు కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై విమర్శలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోచేతినీళ్లు తాగున్నారని అన్నారు.