కాంగ్రెస్ పార్టీకి అవే శాపం: ఏకిపారేసిన హరీశ్ రావు
కాంగ్రెస్ పార్టీ నేతలపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు బాగుపడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు బాగుపడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందని ధ్వజమెత్తారు. శుక్రవారం శాసనసభాపక్ష కార్యాలయంలో హరీష్రావు మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిట శాపంగా మారాయని ఎద్దేవా చేశారు.
బాధలో కాంగ్రెస్..
అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ బాధలో ఉందని అన్నారు. రైతులు, ప్రజలు కూడా బాధలో ఉండాలనేది కాంగ్రెస్ ధోరణి అని హరీశ్ దుయ్యబట్టారు. రైతులను ఆత్మనూన్యతా భావంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదర్శ వంతమైన పథకం..
టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను రైతులు మెచ్చుకుంటున్నారని.. రైతుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందన్నారు. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం చేసిన చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా పూర్వ వైభవం తీసుకొచ్చామని తెలిపారు. మిషన్ కాకతీయను చూసి ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, ప్రపంచం కూడా మెచ్చుకుంటుందని గుర్తు చేశారు.
ఉత్తమ్కు అర్హతే లేదు..
నీలం తుఫానులో నష్టపోయిన రైతులకు మొండి చేయి చూపించిన చరిత్ర కాంగ్రెస్ది అని ధ్వజమెత్తారు. ఆనాడు నోరెత్తని ఉత్తమ్కుమార్రెడ్డికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు. అప్పుడు నష్టపోయిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అందించామని మంత్రి హరీష్రావు గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని హరీశ్ తెలిపారు.
రైతు ప్రభుత్వం..
కాంగ్రెస్ హయాంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను తాము పూర్తి చేశామని హరీశ్ తెలిపారు. గతేడాది చెరువుల కింద 16 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని పేర్కొన్నారు. మహబూబ్నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు కరెంట్ను పట్టించుకోలేదు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు.