హరీశ్ రావుకూ గెంటివేత తప్పదు: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, సీఎం పదవి కోరుకోలేదంటూ..
హైదరాబాద్: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా చేపట్టిన 'ప్రజా దీవెన యాత్ర' పాదయాత్రలో భాగంగా ఈటల మంగళవారం నేరెళ్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు.

పిచ్చి వేశాలొద్దు.. ఈటల రాజేందర్ వార్నింగ్..
నేరెళ్ల ధర్మం తప్పదని రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండని అన్నారు. బీజేపీ జెండాలు పీకెయ్యడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని.. తాము తలుచుకుంటే వేరే ఉంటుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయారని ప్రశ్నించారు. కేసీఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసమని.. దళిత సీఎం ఎటుపోయింది? ఉపముఖ్యమంత్రిని ఎందుకు పీకినవ్? మూడు ఎకరాల భూమి ఎటు పోయింది? పెన్షన్లు ఎటుపోయినయ్? అంటూ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎర్రబెల్లి.. కొత్త పింఛన్లు ఇచ్చే అధికారం నీ చేతిలో ఉందా? 10 కోట్లు ఇచ్చినా మా నియోజకవర్గం ప్రజలు ఆత్మను అమ్ముకోరంటూ ఈటల వ్యాఖ్యానించారు.

హరీశ్ రావు.. నీకు నా గతే: ఈటల రాజేందర్
'మా డబ్బుతో సోకులు చేసేది మీరు. రంగనాయక సాగర్కి తీసుకుపోయి మనుషులను కొంటున్నావ్.. హరీశ్ రావు నిన్ను కూడా కేసీఆర్ వదిలిపెట్టడు. నీకు నా గతే పడుతుంది' అని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజు యాత్ర కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోనూ ఈటల పర్యటించారు. డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాల మధ్య పాదయాత్ర సాగింది. అంబాల నుంచి గూడూరు, నేరెళ్ళ, లక్ష్మీపూర్, కాశింపల్లి, పగిడిపల్లి, వంగపల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది.

హన్మకొండ కేంద్రంగా నాపై దాడికి కుట్రలు: ఈటల రాజేందర్
హన్మకొండ కేంద్రంగా తనపై దాడికి కుట్ర జరుగుతుందని సమాచారం ఉందన్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసే వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మంత్రుల ఫోన్స్ ట్యాప్ చేసే ప్రభుత్వానికి.. తనపై జరుగుతున్న కుట్ర గురించి తెలియదా? మాజీ ఎమ్మెల్యేలకు టు ప్లస్ టు గన్మెన్లను ఇచ్చే సర్కార్.. కక్ష సాధింపుతో తనకు మాత్రం వన్ ప్లస్ వన్ గన్మెన్లను మాత్రమే సెక్యూరిటిగా ఇచ్చిందని చెప్పారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చట్టానికి లోబడి కాకుండా.. చుట్టానికి లోబడి పని చేస్తున్నాడని ఆరోపించారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ బాధితుడేనంటూ ఈటెల
ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ బాధితులేనన్నారు. తాము పొలిటికల్ బాధితులమైతే.. వాళ్లు అఫిషియల్ సైడ్ నుంచి బాధితులని చెప్పుకొచ్చారు. పశువులను అంగట్ల కొన్నట్లు హుజురాబాద్లో నేతలను కొనుగోలు చేస్తున్నారని అధికార టీఆర్ఎస్పై మండిపడ్డారు. ప్రతి రోజు సిద్ధిపేటకు బస్సుల్లో తీసుకెళ్లి బువ్వపెట్టి తన గురించే చెబుతున్నారన్నారు. తాను సీఎం కావాలని ఆశపడ్డానని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదని, ఆయన కుర్చీ గుంజుకోవాలనుకోలేదు. కానీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరానని ఈటల రాజేందర్ తెలిపారు.












Click it and Unblock the Notifications