ఏపీ మంత్రి ఉమకు హరీశ్ రావు ఫోన్
హైదరాబాద్: ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావుతో మంత్రి హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. తుంగభద్ర డ్యామ్ నుంచి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటి విడుదల అంశంపై హరీశ్ రావు ఆయనతో ఫోన్లో చర్చించారు.
ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషి, ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల కార్యదర్శి శశిభూషణ్రావుతో మాట్లాడారు. నీటి విడుదలపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు కావలసిన జల ప్రతిపాదనలతో కూడిన ఇండెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇవ్వాల్సి ఉంది.
ఉమ్మడిగా ఇండెంట్ ఇస్తే ఇటు ఆర్డీఎస్కు, అటు సుంకేసులకు నీరు చేరుతుంది. తుంగభద్ర నుంచి ఏపీకి 5.2 టీఎంసీలు, తెలంగాణకు 3.5 టీఎంసీల నీటివాటా రావాల్సి ఉంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని చాలా రోజులుగా ఆర్డీఎస్ పరిధిలోని రైతులు కోరుతున్నారు.
Recommended Video
ఇరురాష్ట్రాల సాగునీటి పారుదలశాఖ మంత్రులు ఫోన్లో చర్చలు జరిపిన తర్వాత ఉమ్మడి ఇండెంట్ పంపించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. దీంతో ఒకటి రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు విడుదల కానుంది.