అమిత్ షా కుమారుడిపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు: కాంగ్రెస్కు కేటీఆర్ చురకలు
హైదరాబాద్: ఖమ్మం బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయలని విమర్శించారు.
'మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది' అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.

'పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్ ను విమర్శించేది.. 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది.. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే' అంటూ హరీశ్ రావు విమర్శించారు.
'సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్. అబద్ధపు విమర్శలు.. అవుట్ డేటెడ్ ఆరోపణలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో హోం మంత్రి స్కిట్' అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ సెటైర్లు
చేవెళ్లలో కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'అది డిక్లరేషన్ సభ కాదు.. అదికారం రానే రాదనే కాంగ్రెస్ ఫ్రస్టేషన్ సభ. కర్ణాకటలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణకొచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరు? గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారంటీ లేదు. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది? చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజను హామీలు గాల్లో దీపాలే' అని విమర్శించారు.
' స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా.. ఎస్సీలు ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే.. దానికి కారణం... ప్రధాన దోషే... కాంగ్రెస్ పార్టీ. దళిత, గిరిజన బిడ్డలకు.. కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే.. ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా.. వెంటాడుతూనే ఉంటుంది. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే.. ఎబిలిటీ లేదు,
ప్రజల్లో.. క్రెడిబిలిటీ లేదు' అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.
'తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠం.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వని హామీలెన్నో అమలుచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో... బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే...' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications