ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ ఏంటో తెలిసింది: హరీశ్ రావు విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ విధానాలు బయటపడ్డాయని అన్నారు. పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు గుదిబండలా మారాయన్నారు.
అంతేగాక, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ప్రజలకు మరింత భారంగా మారాయన్నారు హరీశ్ రావు. కరోనా సంక్షోభంతో ఆదాయం కోల్పోయిన ప్రజలను అధిక ధరలు మరింత అప్పుల్లోకి, కష్టాల్లో నెడుతున్నాయన్నారు. రాయితీలను భరించాల్సిన కేంద్రం రూ. వేల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
మరోవైపు, మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదనలు పంపలేదన్నది పచ్చి అబద్ధమని కేంద్రంపై మండిపడ్డారు హరీశ్ రావు. మొన్న తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు రాలేదని చెప్పిన కేంద్రం.. ఈ రోజు మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా పచ్చి అబద్ధాలు వల్లె వేసింది. ఏకంగా పార్లమెంట్లోనే గోబెల్స్ ప్రచారానికి దిగింది. మెడికల్ కాలేజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విన్నవించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
శుక్రవారం కూడా మంత్రి హరీశ్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు నిజాం హయాంలోనే స్థాపించారు. అంటే ఉమ్మడి పాలనలో వచ్చినవి కేవలం మూడు. హైదరాబాద్తోపాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర నిధులతో 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు హరీశ్ రావు. ప్రస్తుతం 8 కాలేజీల పనులు తుది దశకు చేరాయి.
శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న హరీశ్ రావు
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం ఈవో లవన్న ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.