ముందే ఆ పార్టీలోకి బాబు కోవర్టులు, వరంగల్ రావేం: హరీష్, కాంగ్రెస్ నేతల తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే తిరుగుతున్నారని, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఎందుకు తిరగడం లేదని తెరాస నేత, మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు సోమవారం ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే తాము తెలంగాణను ఇవ్వలేకపోతున్నామని స్వయంగా బీజేపీ అగ్రనేత అద్వానీ అన్నారని చెప్పారు.
టీడీపీతో పొత్తు వల్లే తెలంగాణ ఇవ్వడం లేదని నాటి బీజేపీ నేత యశ్వంత్ సిన్హా 14 ఏళ్ల క్రితం చెప్పారన్నారు. చంద్రబాబు అడ్డుపడకుంటే 18 ఏళ్ల క్రితం లేదా పదేళ్ల క్రితమే తెలంగాణ వచ్చేదని చెప్పారు. 1956లో తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారం, ఓ కుట్రతో ఇక్కడకు వస్తున్నారని చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారన్నారు.

కాంగ్రెస్ నేతల తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు ఇవీ
తెలంగాణలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఉందని హరీష్ రావు చెప్పారు. ఇవి సాదాసీదా ఎన్నికలు కావన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ముసుగులో తెలంగాణకు వస్తున్నారన్నారు. తెలంగాణకు రూ.1 రూపాయి ఇవ్వనని నాడు కిరణ్ కుమార్ రెడ్డి చెబితే ఒక్క తెలంగాణ కాంగ్రెస్ నేత అడ్డుపడలేదని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి తాను జాతీయవాదిని అని ప్రకటించుకున్నారని చెప్పారు. తెలంగాణ ఇప్పుడు అవసరం లేదని మల్లుభట్టి విక్రమార్క యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి లేఖ రాశారన్నారు. హస్తం పార్టీకి ఓటు వేయకుంటే మళ్లీ తెలంగాణను ఆంధ్రలో కలుపుతామని బలరాం నాయక్ చెప్పారని హరీష్ రావు మండిపడ్డారు. సమైక్య ఆంధ్రలోనే తెలంగాణ సుభిక్షమని కంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారని చెప్పారు. తెలంగాణకు నష్టం చేసే పులిచింతల ప్రాజెక్టును దగ్గరుండి కట్టించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ వద్దని జగ్గారెడ్డి వారి పార్టీ అధినేత్రికి నాడు లేఖ రాశారని చెప్పారు.

కోవర్టులను కాంగ్రెస్లోకి పంపిన చంద్రబాబు
తెలంగాణ ఇవ్వొద్దని ప్రణబ్ కమిటీకి చంద్రబాబు లేఖ రాశారని హరీష్ రావు అన్నారు. ముందుగా చంద్రబాబు తన కోవర్టులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని ఆరోపించారు. చంద్రబాబు చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రకటన రాగానే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు.

తెలుగు ప్రజలను కలిపే శక్తి టీడీపీకే ఉందని చంద్రబాబు అన్నారు
వచ్చిన తెలంగాణపై చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారని హరీష్ రావు అన్నారు. తెలుగు ప్రజలను మళ్లి కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు అనలేదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, హైకోర్టు విభజన ఆయన వల్లే జరగలేదన్నారు.

వరంగల్, కరీంనగర్లకు చంద్రబాబు ఎందుకు రావట్లేదు
పొరపాటున కూటమి గెలుచుకుంటే సమైక్యాంధ్ర తలుపులు తెరుచుకుంటాయని చెప్పారు. తాను టీడీపీ కండువాతో తెలంగాణలో తిరగలేనని చంద్రబాబుకు తెలుసునని చెప్పారు. తెలంగాణ పదాన్ని నిషేధించిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. అనేక సందర్భాలలో చంద్రబాబు తెలంగాణను అడ్డుకున్నారని చెప్పారు. తెలంగాణను కబ్జా చేద్దామని చంద్రబాబు గోతికాడ నక్కలా కాచుక్కొని కూర్చున్నారన్నారు. చంద్రబాబు గోబెల్స్ బాబు అన్నారు. తెలంగాణపై నరనరాన వ్యతిరేకత ఉన్న చంద్రబాబు అన్నారు.

కోదండది కుడితిలో పడిన ఎలుక పరిస్థితి
దురదృష్టకరమైన సమీకరణాలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయని హరీష్ రావు చెప్పారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. పలు ప్రాజెక్టులపై కేసులు వేశారన్నారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమిలో సీపీఐ, కోదండరాంల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారయిందని చెప్పారు. తెలంగాణ మనుగడను నాశనం చేసేందుకే ప్రజాకూటమి అన్నారు.












Click it and Unblock the Notifications