స్టిక్కర్లు అంటించడం ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ఉందండోయ్
Revanth Reddy: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పలు పథకాల పేర్లు మారాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్లకు కొత్త స్టిక్కర్లను అంటించింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం.
ఈ క్రమంలో- వైఎస్ఆర్ భరోసా కాస్తా ఎన్టీఆర్ భరోసాగా మారింది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనను పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్గా, జగనన్న విదేశీ విద్యాదీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్సార్ కల్యాణమస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చింది కూటమి సర్కార్. ఉచిత విద్యుత్ స్కీమ్ పేరూ మారింది. సంపూర్ణ పోషణ పథకాన్ని బాల సంజీవినిగా పేరు పెట్టింది.

ఇప్పుడు అదే తరహా వైఖరి తెలంగాణలోనూ తలెత్తింది. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల పేర్లు మారాయి. ఈ క్రమంలో హరిత హారం పథకానికి కొత్తగా మరో పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వన మహోత్సవంగా నామకరణం చేసింది.
హరిత హారం పేరును వన మహోత్సవంగా మార్చడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు. లోగోను కూడా మార్చారు. ఇందులో కొత్తగా 75 అంకెను చేర్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ఈ అంకెను ఇందులో పొందుపరిచారు.
అడవులకు గుర్తుగా ఓ భారీ వృక్షాన్ని చేర్చారు, పచ్చదనానికి సంకేతంగా లోగోలోని అక్షరాలను ఆకుపచ్చరంగులో తీర్చిదిద్దారు. ఇకపై వన మహోత్సవం పేరుతోనే హరితహారం కార్యక్రమాలను చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకానికి కేటాయించే నిధులను మరింత పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications