రేవంత్రెడ్డి బెయిల్ షరతులు సడలించలేం: పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి తన బెయిల్ షరతులను సడలించాలంటూ చేసిన అభ్యర్థనను హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిలు మంజూరు చేస్తూ నియోజకవర్గ పరిధి దాటి వెళ్లరాదంటూ షరతు విధించిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలో తాను సీనియర్ నేతనని, రాజధానిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అందుకు వీలుగా బెయిలు షరతులను సడలించాలని కోరుతూ రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ దశలో నిందితుడికి బెయిలు షరతులను సడలించరాదంటూ అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది వి రవికిరణ్రావు అభ్యంతరం తెలిపారు. కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆరోగ్య కారణాలు, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం సడలింపు కోరితే పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజాఇళంగో బెయిలు షరతులను సడలించే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో రేవంత్రెడ్డి తరఫు న్యాయవాది పిటిషన్ను ఉపసంహరించుకుంటానని తెలిపారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తూ పిటిషన్ను కొట్టివేశారు.
ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహలు కూడా బెయిలు షరతులను సడలించాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. షరతుల్లో భాగంగా ప్రతిరోజూ దర్యాప్తు సంస్థ ముందు హాజరవుతున్నామని, ఈ కేసులో దర్యాప్తు సంస్థ అభియోగపత్రం దాఖలు చేసినందున షరతులను సడలించాలని కోరారు. దీనిపై ఏసిబి వివరణ కోరుతూ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.