తాండూరులో హీటెక్కిన రాజకీయం - కేటీఆర్ వద్దకు పంచాయితీ : అభ్యర్ధి తానే అంటున్న రోహిత్..!!
తాండూరుల ఎమ్మెల్సీ వర్సస్ ఎమ్మెల్యే పంచాయితీ తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి సీఐ రాజేందర్రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని ఆడియో బయటకు రావటంతో పెద్ద ఎత్తున కలకలం మొదలైంది. దీని పైన మహేందర్ రెడ్డి స్పందించారు. ఆ ఆడియో తనది కాదని చెప్పుకొచ్చారు. అదంతా ఎమ్మెల్యే రోహిత్ కుట్రగా ఆరోపించారు. తాను సీఐను దూషించలేదని చెబుతున్నారు. ఇదే సమయంల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. మొత్తం ఘటన పైన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా తాండూరులో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ చెబుతున్నట్లుగా తన పక్కన రౌడీషీటర్లు ఎవరూ లేరని చెప్పారు. పోలీసులను ఎమ్మెల్సీ దూషించడం సరికాదని, ఆడియో తనది కాదని చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని..వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తాండూరు అభ్యర్ది తానేనని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ చేస్తున్న ఇసుక దందా ఆరోపణల పైన రియాక్ట్ అయ్యారు. అసలు తాండూరు నియోజకవర్గంలో ఇసుక దందా అనేదే లేదన్నారు. సీఐ రాజేందర్ రెడ్డి మంచి వ్యక్తి అని చెబుతూ.. తన పూర్తి మద్దతు సీఐకు ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇక, పోలీసు అధికారుల సంఘం సైతం ఎమ్మెల్సీ సీఐ పైన దుర్భాషలాడారని తప్పు బట్టింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో మరో పోలీసు అధికారి.. యాలాల ఎస్సైను సైతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి దూషించారంటూ మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో స్టేజీ పైన తనకు నచ్చని వారిని కిందకు దించాలంటూ ఎమ్మెల్సీ తనను దుర్భాషలాడారని ఎస్సై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంలోనూ ఎమ్మెల్సీ పైన కేసు నమోదు అయినట్లు సమాచారం. అయితే, తాండూరు రాజకీయం ముదురుతున్న సమయంలో పార్టీ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుుడు ఆసక్తి కరంగా మారుతోంది.