అరగంట వాన: హైదరాబాదులో బీభత్సం సృష్టించింది, కూలిన చెట్లు, కార్లు ధ్వంసం (ఫోటోలు)
హైదరాబాద్: ఎండ వేడిమితో సతమతమవుతున్న నగర వాసులను శుక్రవారం సాయంత్రం వర్షం పలకరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం పూట నగరంలోని పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది.
అరగంటకే నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉన్నా వాతావరణ శాఖ మాత్రం వర్షం వస్తుందన్న విషయాన్ని గుర్తించలేకపోయింది. వర్ష సూచన లేకపోవడంతో ప్రజలు హాయిగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.
అయితే ఉన్నట్టుండి సాయంత్రం ప్రాంతంలో బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం నగరవాసులను కలవరపాటుకుు గురిచేసింది. కొన్నిచోట్ల భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మరికొన్ని చోట్లయితే పెద్ద పెద్ద హోర్డింగ్స్ నేలకొరిగాయి. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి.
ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడటంతో ఐదు గంటలకే నగరంలోని రోడ్లన్నీ చీకటిమయంగా మారాయి. భారీ వర్షం కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. శివారు ప్రాంతాలు కూడా వర్షంతో తడిసి ముద్దయ్యాయి. వర్షం నీటితో రోడ్లన్నీ జలమయంకావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పగిలిన పైప్ లైన్
ఇదిలా ఉంటే బంజారాహిల్స్ వాటర్ ట్యాంక్ వద్ద పైప్ లైన్ పగిలిపోయింది. నీటి ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. సాయంత్రం పూట కావడం, ఉద్యోగస్తులంతా ఇంటికి వెళ్లే సమయం కావడంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పగిలిన పైప్ లైన్
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో భారీ వృక్షం పడటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంబించిపోయింది. మరోవైపు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర భారీ ఈదురుగాలులతో పెద్ద హోర్డింగ్ నేలకొరిగింది.
పలువురికి గాయాలు
కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. హోర్డింగ్ కింద పడటంతో అక్కడున్న వాహనాదారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. హోర్డింగ్ కింద పడటంతో అక్కడున్న కొన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఈ భారీ వర్షం పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
సికింద్రాబాద్లో వడగళ్లు
సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. బేగంపేట, బోయిన్పల్లి, అడ్డగుట్ట ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి.
'రోను' ప్రభావం కాదు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'రోను' తుపాను నగరంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈదురుగాలులకు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టువెళ్లే మార్గంలో ఓ భారీ హోర్డింగ్ విరిగిపడి 8కార్లు ధ్వంసమయ్యాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానాలు
హైదరాబాద్లో సాయంత్రం కురిసిన భారీ వర్షం, గాలివాన బీభత్సం ప్రభావం శంషాబాద్ ఎయిర్ పోర్టుపై కూడా పడింది. సాయంత్రం ఐదు గంటల నుంచి పలు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన విమానాల్లో 'స్పైస్ జెట్'వి ఉన్నాయి. మరోవైపు పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అత్తాపూర్లో కూలిన ప్రహరి గోడ: ఒకరు మృతి
నగరంలోని అత్తాపూర్లో ప్రహరీ గోడ ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అపోలో సమీపంలో సెల్ టవర్ కూలింది. ఎమ్మెల్యే కాలనీలో కూలిన భారీ వృక్షం నెలకొరిగింది.
ప్రజలు రోడ్లమీదకు రావొద్దు: జీహెచ్ఎంసీ కమిషనర్
ప్రజలు రోడ్లమీదకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సూచించారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ సూచన చేశారు. కాగా అరగంట సేపు కురిసిన వాన నగరంలో భీభత్సం సృష్టించింది. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ భారీ హోర్డింగ్ కూలింది. ఈ ఘటనలో పలు కార్లు ధ్వంసమయ్యాయి.