భారీ వర్షాలు, వరదలు: పరీక్షలు వాయిదా వేసిన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ప్రకటించాయి. ఇది ఇలావుంటే, అక్టోబర్ 19, 20వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. అక్టోబర్ 22 నుంచి జరగాల్సిన పరీక్షలను యథాతథంగా జరుగుతాయని వెల్లడించింది.
అక్టోబర్ 19, 20వ తేదీల్లో నిర్వహించాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి 20, 21వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ తెలిపింది. అదేవిధంగా యూనివర్సిటీలో పరిధిలో జరగాల్సిన నాలుగో సెమిస్టర్ పరీక్షలను కూడా వాయిదా వేసింది. అక్టోబర్ 19, 20వ తేదీల్లో జరగాల్సిన ఎంబీఏ పరీక్షలను 21,22వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

అక్టోబర్ 19,20వ తేదీల్లో జరగాల్సిన బీఈడీ దూరవిద్య పరీక్షలను నవంబర్ 2,3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను కాకతీయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొంది.
కాగా, హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండ్రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటనతో పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications