తెలంగాణకు చల్లని కబురు, ఈ జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా, వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. రానున్న రెండు రోజులు ఎండలతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారా(ఏప్రిల్ 26, 27)ల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
శనివారంనాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బయటకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది.
మరోవైపు, హైదరాబాద్ నగరంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో కూడా రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని సూచించింది.
అయితే, శనివారంనాడు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, వరంగల్ జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆయా జిల్లాల్లో నమోదవుతాయని తెలిపింది. ఇక, శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications