పూర్తైన మండమెలిగే పండుగ తంతు: మేడారంకు పొటెత్తిన భక్తులు
మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మొదలైన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(మండమెలిగే పండుగ) బుధవారం మొదుకాగా గురువారంతో తంతు ముగిసింది.
తాడ్వాయి: మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని మొదలైన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(మండమెలిగే పండుగ) బుధవారం మొదుకాగా గురువారంతో తంతు ముగిసింది. బుధవారం రాత్రి నుండి పూజారులు కుటుంబసభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా జాగరణ చేశారు.
గురువారం ఉదయం పూజారులు సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారంలోని సమ్మక్కతల్లి దేవాలయానికి పూజాసామగ్రిని తీసుకెళ్ళి ప్రతిష్టించారు. అదేవిధంగా సారలమ్మ గద్దె వద్ద సైతం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సారలమ్మ గద్దె వద్ద సైతం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా సామగ్రిని కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయానికి తరలించారు. దీంతో మండలమెలిగే పండుగ ఘట్టం పూర్తయింది.
అనంతరం పూజారులు, కుటుంబ సభ్యులు, బంధువులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని పసుపు, కుంకుమ, చీరెసారె, బెల్లం(బంగారం), కోళ్లు, మేకపోతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మల దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం
మండలమెలిగే పండుగ తంతు పూర్త కాగానే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు పోటెత్తారు. ముందుగా జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరకున్న భక్తులు క్యూలో అమ్మలను దర్శించుకుని పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం), చీరెసారె, కోళ్ళు, మేకలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గద్దెల ప్రాంగణాలు భక్తజనంతో కిటకిటలాడాయి.
అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులను భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జాతర పరిసర ప్రాంతాల్లో విడిది చేసి సందడి చేశారు. కాగా, ఏటూరునాగారం ఎఎస్పి రాహుల్ హెగ్దే, ములుగు ఇన్చార్జి డిఎస్పి దక్షిణామూర్తిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా జేసీ అమయ్కుమార్, ములుగు సబ్ కలెక్టర్ విపి. గౌతంలు జాతర నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.