నగరంలో మిల్కా సింగ్: 'ఫ్లయింగ్ సిఖ్' అనే పేరు ఇలా వచ్చిందని వివరణ
హైదరాబాద్: తనకు 'ఫ్లయింగ్ సిఖ్' అన్న పేరెందుకు వచ్చిందో పరుగు వీరుడు మిల్కా సింగ్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో జరిగిన 10కే రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
"పాకిస్థాన్లో అబ్దుల్ హాలిక్ అనే అథ్లెట్ అప్పట్లో చాలా వేగంగా పరుగెత్తేవారు. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో అతన్ని తొలిసారిగా కలిశాను. ఆ పోటీల్లో హాలిక్ను నేను ఓడించాను. న్యాయ నిర్ణేతలు సైతం దాన్ని నమ్మలేకపోయారు. ఓ గంటపాటు చర్చించిన తరువాతనే విజేతగా నాపేరు ప్రకటించారు. టోక్యోలో నా ప్రదర్శనపై పాక్ లో సైతం చర్చ జరిగింది. ఆపై 1960లో లాహోర్లో జరుగుతున్న పరుగుల పోటీలకు రావాలని ఆహ్వానం అందింది. నేను కొన్ని కారణాల వల్ల నిరాకరించాను. విషయం తెలుసుకున్న ఆనాటి ప్రధాని నెహ్రూ స్వయంగా నన్ను పిలిచి, పోటీలకు వెళ్లాలి" అని సూచించారు.

దీంతో మొత్తం 50 మంది క్రీడాకారులం బస్సులో బయల్దేరి పాక్ సరిహద్దులకు చేరగానే ఘనస్వాగతం లభించిందన్నారు. బస్సులో నుంచి దిగాలని కోరిన పాక్ అభిమానులు, ఓపెన్ టాప్ జీపులో ఎక్కించి, అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని లాహోర్ వరకూ భారత జెండాలతో ఊరెగిస్తూ, పూలు చల్లి తీసుకెళ్లారన్నారు.
అనంతరం లాహోర్ చేరుకున్న మా బృందానికి అక్కడి పత్రికల్లో 'హాలిక్, మిల్కాల రూపంలో భారత్, పాక్లు పోటీపడుతున్నాయి' అంటూ వార్తలు కనిపించాయి. ఆ మరుసటి రోజున జరిగిన పోటీలకు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ వచ్చారు.

ఆయన సమక్షంలో జరిగిన పరుగు పందెంలో నేను మొదటి స్థానంలో రాగా, మకన్ సింగ్ రెండో స్థానంలో, హాలిక్ మూడవ స్థానంలో నిలిచామన్నారు. పరుగు పందెం అనంతరం ఆయన నా మెడలో పతకం వేసే ముందు ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ 'మిల్కాజీ... మీరు పరుగు పెట్టలేదు. గాలిలో ఎగిరినట్టు మాకు అనిపించింది' అంటూ, 'ఫ్లయింగ్ సిఖ్' బిరుదును ఇస్తున్నట్టు వేదికపై వెల్లడించారు" అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ఇక 'రన్ ఫర్ వెల్ నెస్' అనే కాన్సెప్ట్తో ఆదివారం ఉదయం హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి హుస్సేన్ సాగర్ చుట్టూ నిర్వహించిన ఈ పరుగు పందెంలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications