ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హైకోర్టు అనుమతి నిరాకరణ
హైదరాబాద్: ఖమ్మంలో మే 28న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించింది. విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులివ్వాలని యాదవ సంఘాలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల విగ్రమాల ఏర్పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని వాదించాయి. ప్రభుత్వం తరపున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ.. విగ్రహంలో పిల్లన గ్రోవి, పింఛం తొలగించినట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనికాగా, ఖమ్మం లకారం చెరువులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు(NTR) కృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయించారు.

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న దీన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని రూ. 2.3 కోట్లతో నిజామాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. మరోవైపు, లకారం చెరువు మధ్యలో కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
అంతకుముందు పరిణామాలు గమనించినట్లయితే.. ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇటీవల కలిశారు. ఖమ్మం నగరాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చుతున్న క్రమంలో లకారం ట్యాంక్ బండ్పై స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన మనుమడైన జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేయాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తోపాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారని నిర్ణయించారు.
అయితే, ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై అఖిల భారత యాదవ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని అఖిల భారత యాదవ సమితి హెచ్చరిక జారీ చేసింది. మే 28వ తేదీన తలపెట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేయాలని లేదంటే అడ్డుకుంటాం అని , నిరసనలు చేస్తామని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అనుమతి నిరాకరించింది.












Click it and Unblock the Notifications