కెసిఆర్ వరాలన్నీ హుష్కాకి: హైకోర్టుల్లో చుక్కెెదురే...
హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం కోసం గతేడాది దసరా నాడు కొత్త జిల్లాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. కానీ ప్రభుత్వ పాలనా వ్యవహారాలతో కాలం ఆగదుగా.. చకచకా సాగిపోతూనే ఉంటుంది. అదీ చటుక్కున ఏడాది దాటిపోయింది. ఉద్యోగ నియామకాలు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తదితర విషయాల్లో 'తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ' అన్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైఖరి సాగుతున్నది.
కొన్ని కీలక విషయాల్లో కేంద్రంతోనూ.. రాష్ట్రపతితోనూ అనుబంధం ఉన్న విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేసినట్లు.. దానిపై శ్రద్ధ చూపుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.
ప్రత్యేకించి కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ సిఫారసుల మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం తప్పనిసరి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరమే లేదని కొట్టి పారేసి మరీ టీచర్ల నియామకానికి నూతన 21 జిల్లాలతో కలిపి మొత్తం 31 జిల్లాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. 'టీఆర్టీ నోటిఫికేషన్'ను జారీ చేసింది.
అక్షింతలేసిన రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నిబంధనలను, 8,700కి పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఆదిలాబాద్కు చెందిన అరుణ్కుమార్, మరి కొందరు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు.. ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోనూ సవరణలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదేమీ చేయకుండా టీచర్ల నియామకాలు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఉద్యోగ నియామకాల కోసం లక్షల మంది తెలంగాణ యువత ఆశగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం తీరు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నది.
20 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలెలా భర్తీ?
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందన్నట్లు 41 నెలల కాలంలో పూర్తి చేయని పనిని మరో 19 నెలల్లో అందునా ఎన్నికల సంరంభానికి నాలుగైదు నెలలు పోతే ఏడాది కాలంలో పూర్తి చేసేస్తామని తెలంగాణ ప్రభుత్వం నమ్మ బలుకుతోంది. గత వేసవిలో రాష్ట్ర ప్రభుత్వ రంగానికి చెందిన విద్యుత్ సంస్థల్లో నియామకాల విషయమై అదీనూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరణ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు రమారమీ 20 వేలకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణకు జారీ చేసిన ఉత్తర్వులనూ సహజంగానే హైకోర్టులో సవాల్ చేశారు నిరుద్యోగులు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశించిన హైకోర్టు... మధ్య దళారులకు చోటు లేకుండా వారందరికీ నేరుగా కన్సాలిటేడ్ వేతనాలు చెల్లించాలని ఆదేశించింది. అంతే కాదు ఉద్యోగ నియామకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని చురకలు వేసింది. దీనిపై సీఎం కేసీఆర్ ఒక స్థాయిలో చెలరేగిపోయారు. ఉద్యోగులు అందరికీ రూ.1000 ఎక్కువే ఇస్తామని సెలవిచ్చారు. కానీ ఆచరణలో పాత వేతనాల కంటే రూ.300, రూ.400 మాత్రమే పెరిగాయి. వారి ఉద్యోగాల క్రమబద్దీకరణ ఊసే లేదు.
శాశ్వత నియామకాల అవకాశం కోల్పోయిన విద్యుత్ ఉద్యోగులు
కానీ విద్యుత్ రంగంలోని వివిధ సంస్థల్లో 2014లో కేవలం వందల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం 20 వేల మంది దాటారు. కానీ వారి స్థానంలో శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తాము చర్యలు తీసుకుంటే విపక్షాలు అడ్డు తిరుగుతున్నాయని శాపనార్ధాలు పెట్టారు. అదే సమయంలో టీచర్ల నియామకం ప్రస్తావనకు వచ్చింది. డీఎస్సీ వేయకపోతే ఏమవుద్ది? అని మీడియాకే ఎదురు ప్రశ్నలేశారు సీఎం కేసీఆర్. కానీ అప్పటికే సుప్రీంకోర్టు ఒకటి, రెండుసార్లు అక్షింతలు వేసేసింది మరి. తాజాగా అక్టోబర్ రెండో వారం లోగా నోటిఫికేషన్ జారీ చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భయంతోనే ఆగమేఘాలపై 10 జిల్లాలకు బదులు 31 జిల్లాల పేరిట ‘టీఆర్టీ' నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అదీ అసలు సంగతి.
10 జిల్లాలకు నోటిఫికేషన్ సవరించాలని హైకోర్టు ఇలా
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సంగతి పట్టించుకోకుండా.. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యం తెలంగాణ ప్రభుత్వానిది. కానీ దీన్ని ప్రశ్నించిన వారంతా తెలంగాణ వ్యతిరేకులన్న ముద్ర వేసేందుకు విఫల యత్నం చేస్తోంది. టీఆర్టీ నోటిఫికేషన్ను 10 జిల్లాలకు సవరిస్తూ జీవో.. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొన్న న్యాయస్థానం.. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ‘కొలువుల కొట్లాట' సభ నిర్వహణకు అనుమతి నిరాకరిస్తున్న పోలీసుశాఖపై గట్టిగా మొట్టి కాయలు వేసింది. జేఏసీ ఎప్పుడు అనుమతి కోరినా 48 గంటల్లో పర్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీన, డిసెంబర్ 1, 6వ తేదీల్లో మినహా ఏ తేదీల్లో సభ పెట్టుకోవడానికైనా అనుమతి ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ప్రజా సంఘాల ఆందోళనలపై ఇలా సర్కార్
తెలంగాణ జేఏసీ ఒక్కటే కాదు రాష్ట్రంలో ఏ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సభల నిర్వహణకు అనుమతులు నిరాకరిస్తూ మొండిగా అణచివేత వ్యూహాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాడే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలు పరిష్కరించాలని ‘చలో అసెంబ్లీ'కి పిలుపునిస్తే జిల్లాల్లో చోటామోటా నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నాయకులను హౌస్ అరెస్ట్ చేసింది. ఇలా విపక్షాలను అణచివేయడం ద్వారా ‘తెలంగాణ సమాజం'లో అన్నీ తామే? అన్న వైఖరితో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
ముందుగా రాజీనామా చేసి రమ్మని రేవంత్కు పల్లా సవాల్
కానీ ప్రభుత్వం తనకు కావాల్సిన వారికి మాత్రం ఏం చక్కా ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తున్నది. దీనిపైనే స్పందించిన ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో టీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ శివారులో ఫెనాన్సియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ‘గచ్చిబౌలి' వద్ద గల స్టేడియంలో ‘సన్ బర్న్' సంస్థ సాంస్క్రుతిక సంస్థ ‘షో'కు ఎలా అనుమతించారని నిలదీశారు. రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బావ మరిది నిర్వహిస్తున్నందునే అనుమతించారని నిప్పులు చెరిగితే.. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి రంగ ప్రవేశం చేసి.. చంద్రబాబు ఎంగిలి మెతుకులతో గెలిచిన ఎమ్మెల్యేగిరికి ముందు రాజీనామా చేసి. తర్వాత మాట్లాడాలని సవాల్ చేశారు.
సన్బర్న్ షోపై ఇలా హైకోర్టు ఆదేశం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. కానీ దీనిపై దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఘాటుగానే స్పందించింది. ఈ పిటిషన్ సంగతి తెలిసీ యదాలపంగా విచారణకు హాజరైన ప్రభుత్వ న్యాయవాదికి గట్టిగా అక్షింతలేసింది. పోలీసు శాఖ ఎలా అనుమతి ఇచ్చిందని నిలదీసింది. అనుమతులు ఇవ్వకముందే జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించింది. ‘సన్బర్న్షో' నిర్వహణ తీరును వీడియో తీసి ఈ నెల 30న తమ ముందు సమర్పించాలని హైకోర్టు ఆదేశించడం ఈ కోవలోకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకు అనుమతి ఇలా
ముందుగా ‘సన్బర్న్' టిక్కెట్లు విక్రయించిన నిర్వాహకులు ఇప్పుడు 17 ఏళ్ల లోపు బాలలను లోపలకు ఎందుకు అనుమతించడం లేదని శుక్రవారం ప్రశ్నించారు. తల్లిదండ్రులతో వచ్చిన వారిని మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారని వార్తలొచ్చాయి. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయం మాత్రం అధికార పక్షం విస్మరించిందన్న సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.