ఇంకెన్నేళ్లు కావాలి?: తెలంగాణ సర్కారుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, డెడ్లైన్
హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలంతోపాటు మరో మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ.. ఇంకా ఎన్నేళ్లు కాలం వెళ్లదీస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
భద్రాచలంతోపాటు మరో మూడు పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని సవాలు చేస్తూ వీరయ్య అనే వ్యక్తి 2020లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చడానికి వీలులేదని జీవో అమలును నిలిపివేస్తూ అప్పట్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. భద్రాచలంతోపాటు 4 గ్రామాలను పంచాయతీలుగా కొనసాగిస్తామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే, దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని హైకోర్టు నిలదీసింది.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. అయితే, పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. అధికారికంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
2005 నుంచి ప్రభుత్వ న్యాయవాదులు మారుతున్నారని.. వాయిదాలు కోరుతూనే ఉన్నారని మండిపడింది. ఇంకా ఎన్నేళ్లు పడుతుందని నిలదీసింది. నవంబర్ 25 లోగా భద్రాచలంతోపాటు మూడు పంచాయతీలపై నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ తర్వాత విచారణను వాయిదా వేసింది.