బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయానికి పచ్చజెండా
హైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేంద్రం పరిధిలోకి వెళ్లింది. రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో స్థలం కేటాయింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతించింది.
ఈ మేరకు హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూమిని కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. సచివాలయ నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా ఉందని సమాచారం. అయితే న్యాయపరమైన చిక్కులు ఉండటంతో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోయింది.
బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. నిర్మాణ మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే సచివాలయం నిర్మాణం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. మొదట్లో రూ. 175 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణం జరపాలని భావించిన ప్రభుత్వం, ఆ తర్వాత ఖర్చుకు వెనుకాడకుండా కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని ర్ణయించింది.