కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న: మర్మాంగాలు ఎందుకు కమిలిపోయాయి
Recommended Video
హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై హైకోర్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. నేరెళ్ల బాధితులందరికీ రహస్య ప్రదేశాల్లోనే ఎందుకు గాయాలయ్యాయని ప్రశ్నించింది. వారి మర్మాంగాలు కమిలిపోవడానికి కారణమేమిటని అడిగింది
బాధితులందరికీ ఒకే తరహాలో గాయాలు ఎలా అవుతాయని కూడా హైకోర్టు ప్రశ్నించింది. రెండు వైద్య నివేదికల్లో తేడాలు ఎందుకున్నాయని అడిగిందిఇలా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురింపించింది. వైద్య నివేదికల్లో తేడాలపై పట్టిక రూపంలో సమగ్ర వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపుర గ్రామాల్లోని దళితులపై పోలీసులు దాడి చేసిన ఘటనపై సిబిఐతో దర్యాప్తునకుఆదేశించాలని, లేకుంటే ప్రత్యేక బృందానికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు.
చంద్రకుమార్ లేఖ కూడా....
గడ్డం లక్ష్మణ్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో పాటు నేరెళ్ల ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూరతి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖను కూడా పిల్గా పరిగణించి రెండింటినీ హైకోర్టు మంగళవారంనాడు మరోసారి విచారించింది. నేరెళ్లలో ఇసుక లారీల కింద పడి సంభవిస్తున్న మరణాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై కొంత మంది మీద పోలీసులు కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకుని వారిని చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
నివేదికల్లో తేడాలు ఎందుకు....
బాధితులకు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసి ఇచ్చిన నివేదికకూ, జైలు వైద్యాధికారుల వైద్య నివేదికకూ మధ్య వ్యత్యాసం ఎందుకు ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది.
నివేదికకు ఆదేశం...
రెండు వైద్య నివేదికలను బేరీజు వేస్తూ ఒక పట్టికరూపంలో నివేదిక అందించాలని అడ్వొకేట్ జనరల్ (ఎజి) దేశాయ్ ప్రకాశ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపర విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. రెండు వైద్య నివేదికల్లో తేడాలున్న మాట వాస్తవమేనని ఎజి అంగీకరించారు.
ఎస్సై అతిగా ప్రవర్తించారు....
కేసు దర్యాప్తు పేరుతో బాధితులపై ఒక ఎస్సై అతిగా స్పందించారని, పరిధి దాటి కొట్టారని, అందుకే ఎస్సైని సస్పెండ్ చేశామని ఎజి వివరణ ఇచ్చారు. లాఠీ చార్జీ వల్ల బాధితులకు గాయాలయ్యాయని తొలుత అనుకున్నామని తర్వాత ఎస్సై దానికి కారణమని తేలిందని ఆయన అన్నారు.