మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం - హైకోర్టు తాజా ఆదేశాలు..!!
మంచు ఫ్యామిలీ వార్ పీక్ కు చేరింది. మోహన్ బాబు కుటుంబ వివాదం రోడ్డు పైకి వచ్చింది. పోలీసు కేసులు..కోర్టులో విచారణ లు జరుగుతున్నాయి. మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మనోజ్ తన తండ్రి దేవుడి లాంటి వారని చెబుతూనే...తన తండ్రి భుజం పై తుపాకి పెట్టి తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. విష్ణు ఈ వివాదంలో బయటి వ్యక్తులు సాయంత్రంలోకా వదిలి వెళ్లాలని అల్టిమేటం ఇచ్చారు. ఇదే సమయంలో హైకోర్టు మోహన్ బాబు అభ్యర్ధనల పైన కీలక ఆదేశాలు ఇచ్చింది.
మోహన్ బాబు పిటీషన్ లో
మంచు కుటుంబం లో వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఘర్షణలు.. దాడుల వరకు వెళ్లింది. కేసు లు నమోదయ్యాయి. మీడియాలో రచ్చగా మారింది. మీడియా పైన మోహన్ బాబు దాడి చేసారు. దీంతో, పోలీసులు మోహన్ బాబుతో పాటుగా విష్ణు, మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. మనోజ్ రాచకొండ సీపీ ముందు హాజరై తన వాదన వినిపించారు. ఇక, మోహన్ బాబు - విష్ణు తమ హాజరు పై మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను సెక్యూరిటీ కోరినప్పటికీ భద్రత కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు.

పోలీసులకు ఆదేశాలు
ఈ పిటీషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగాయి. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ తమ వాదనలు వినిపించారు. మోహన్ బాబుకు మంగళవారం జరిగిన ఘర్షణలో గాయాలయ్యాయని పిటీషన్ లో వివరించారు. పోలీసుల విచారణ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించారు. దీంతో, కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణకు హాజరు పై మోహన్ బాబుతో పాటుగా విష్ణుకు ఈ నెల 24వ తేదీ తదుపరి విచారణ వరకు మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా మోహన్ బాబు ఇంటి వద్ద భద్రత ను ప్రతీ రెండు గంటలకు ఒకసారి పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది.
మనోజ్ వాదనతో
ఈ ఉదయం మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. వివాదం పూర్వా పరాలను వివరించారు. గత మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు .. దీని వెనుక ఉన్న వ్యక్తుల గురించి సమాచారం ఇచ్చారు. మనోజ్ ఈ వివాదానికి తన అన్న విష్ణు, వినయ్ ప్రధాన కారణంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, విష్ణు మాత్రం వినయ్ తనకు అన్న లాంటి వాడని చెబుతున్నారు. తన తండ్రి ఇంట్లో ఉండవద్దని చెబితే...ఎవరైనా ఉండే హక్కు లేదని పరోక్షంగా మనోజ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, ఈ సాయంత్రం వివాదం పై పూర్తి వివరాలను వెల్లడిస్తానని మనోజ్ ప్రకటించారు. దీంతో, మనోజ్ చెప్పే అంశాలు ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications