వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు: ఆధార్ సహా ఆ వివరాలొద్దు
హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. సాఫ్ట్వేర్లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని స్పష్టం చేసింది.
కులం, కుటుంబసభ్యుల వివరాలు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇతర గుర్తింపు పత్రాలు అడగవచ్చని, ఆధార్ వివరాలు మాత్రం సేకరించవద్దని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

ఎలాంటి చట్టం లేకుండా దరణిలో ఆస్తుల నమోదుతోపాటు కులం, ఆధార్ వివరాలు అడగటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు కే సాకేత్, గోపాల్ శర్మ తోపాటు పలువురు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.
కోర్టుకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని, తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించబోమని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే తమ ఆందోళన అని పేర్కొంది. సాఫ్ట్వేర్లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 20కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications