'కేసీఆర్కు 22సార్లు హైకోర్టు మొట్టికాయలు', 'బాబు బిగ్ బజార్ అవుట్ లెట్లు ఎలా కొన్నారు'
రీడిజైనింగ్ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గురువారం డిమాండ్ చేశారు.
హైదరాబాద్/కరీంనగర్: రీడిజైనింగ్ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గురువారం డిమాండ్ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా దుబారా ఖర్చులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెరాస ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల పైన హైకోర్టు ఇప్పటికే 22 సార్లు మొట్టికాయలు వేసిందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో బుగ్గ కార్ల నేతలు తప్పితే, అభివృద్ధి మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి పైన గాదరి కిషోర్ ఆగ్రహం
ఆచార్య జయశంకర్ పేరును ప్రస్తావించే అర్హత తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి లేదని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్ గురువారం అన్నారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ కల్వకుంట్ల కవితలు టిడిపి యువనేత నారా లోకేష్లా బ్యాక్ డోర్ నేతలు కాదని ఎద్దేవా చేశారు.
తెరాసది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. కోటి ఎకరాల మాగాణికి రేవంత్ రెడ్డి సహకరిస్తారో లేదో చెప్పాలన్నారు. బిగ్ బజార్ అవుట్ లెట్లను చంద్రబాబు ఎలా కొన్నారో రేవంత్ రెడ్డి ప్రశ్నించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ధారాదత్తం చేస్తుంటే మాట్లాడని రేవంత్ ఇప్పుడు మాట్లాడటం అనైతికమన్నారు.