ఎపి బోర్డు ఖాతాల స్తంభన: తెలంగాణను నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింపచేయాలంటూ ఎస్బీఐకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి లేఖ రాయడాన్ని హైకోర్టు నిలదీసింది. అలా లేఖ రాయడానికి మీకున్న అధికారాలేమిటిని ప్రశ్నించింది. ఆ లేఖను ఉపసంహరించుకుంటారా, లేదా? తేల్చుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలే, జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం తెలంగాణ ఇంటర్ బోర్డుకు అడిగింది.
అకస్మాత్తుగా ఓ సంస్థ ఖాతాలు స్తంభింపచేస్తే ఆ సంస్థలోని విద్యార్థుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. చేసిన పొరపాటును గ్రహించి లేఖను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఖాతాల స్తంభనపై బ్యాంక్కు లేఖ రాసిన తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ను భోజన విరామం అనంతరం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ మేరకు హాజరైన ఆయన హైకోర్టు బెంచ్ ముందు హాజరయ్యారు. ఆయనపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.
ఎవరు చెబితే ఖాతాల స్తంభనకు లేఖ రాశారని, మంత్రివర్గం ఏదైనా తీర్మానం చేసిందా అని ప్రశ్నించింది. అలాంటి నిర్ణయమేదీ లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి తరపున తెలంగాణ స్పెషల్ జీపీ బి.మహేందర్రెడ్డి కోర్టుకు తెలిపారు. అయితే లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని బెంచ్ నిలదీసింది.
ఈ కేసులో తెలంగాణ ఇంటర్ బోర్డు తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు చెబుతారని, ప్రస్తుతం ఏజీ అందుబాటులో లేరని, వాయిదా వేయాలని ధర్మాసనాన్ని స్పెషల్ జీపీ అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
తెలంగాణ ఇంటర్ బోర్డు లేఖను చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటిస్తూ ఆ ఖాతాల నిర్వహణకు అనుమతించాలంటూ బ్యాంక్ అధికారులను ఆదేశించాలని ఏపీ ఇంటర్ బోర్డు తరపున అడ్వకేట్ జనరల్ పి.వేణుగోపాల్ కోరారు. ఇటీవల ఏపీ ఉన్నత విద్యామండలికి చెందిన బ్యాంక్ ఖాతాల స్తంభనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా తీసుకుని ఇలాంటి లేఖ రాశారని తెలిపారు.