సెలబ్రటీలకు డబ్బిస్తారు, రైతుల్ని ఆదుకోలేరా: తెలంగాణపై హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పైన హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఘాటుగా స్పందించింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పైన దాఖలైన పిటిషన్ పైన సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సెలబ్రిటీలకు డబ్బులు ఇస్తున్నారని, వినోదంపై ఖర్చు పెడుతున్నారని, అదే అన్నదాతలు ఆపదలో ఉంటే ఆదుకోలేరా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రైతులు ఆత్మహ్యత్యలకు పాల్పడకుండా సమగ్ర విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రెండు వారాల్లోగా పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. గతంలో దాఖలైన ఇలాంటి పిటిషన్ పైన ఇప్పటికే తాము కౌంటర్ వేశామని ప్రభుత్వ లాయర్ చెప్పారు. రెండు పిటిషన్లు ఒకసారి విచారిస్తామని న్యాయస్థానం చెప్పింది.
కల్లు దుకాణాల ఏర్పాటుపై పిటిషన్ కొట్టివేత
తెలంగాణ రాష్ట్రంలో కల్లు దుకాణాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. ఈ మేరకు దుకాణాల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అది ప్రభుత్వం విధాన నిర్ణయమని, దీనిపై జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.