జగన్కు ఊరట: ఈడి విచారణపై హైకోర్టు స్టే, తేల్చాలని ఆదేశం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో ఉన్న కేసును ఈడీ కోర్టుకు బదిలీ చేయాలనే అభ్యర్థనపై ఫిబ్రవరి 29లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది.
అంతదాకా ఈడీ కోర్టులో కేసు విచారణ కొనసాగించరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో శుక్రవారం మధ్యంతర ఆదేశాలు జారీచేశారు. సీబీఐ కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా సమాంతరంగా ఈడీ కోర్టు విచారించడాన్ని ప్రశ్నిస్తూ జగన్, విజయసాయిరెడ్డిలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
జగన్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి వాదించారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే, అదే కేసుకు సంబంధించిన సొమ్ముపై ఈడీ సమాంతర విచారణ కొనసాగించడం చట్టసమ్మతం కాదని, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని, పిటిషనర్ హక్కులను హరించడమేనని వాదించారు.
ఈ వాదనలకు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అభ్యంతరం చెప్పారు. సీబీఐ కోర్టులో విచారణలో ఉన్న కేసును ఈడీ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరారు. అలా చేస్తే రెండు కేసులకు సంబంధించిన విచారణలు ఈడీ కోర్టులో జరుగుతాయని తెలిపారు.
ఈ దశలో కల్పించుకున్న న్యాయమూర్తి సీబీఐ కోర్టులో ఉన్న కేసుల విచారణ పూర్తయ్యే వరకు ఈడీ కోర్టులోని కేసులు విచారణ కొనసాగించరాదనే నిబంధనలేవీ లేవని, తాను రెండు కేసులు కలిపి విచారించాలని ఆదేశిస్తే మీ క్లయింట్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
సీబీఐ కోర్టు విచారణలో ఉన్న కేసులు ఈడీ కోర్టుకు బదిలీ చేయాలన్న ఈడీ అభ్యర్థనపై ఫిబ్రవరి 29లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టుకు స్పష్టం చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా తరఫున కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి చిదంబరం శుక్రవారం హైకోర్టులో వాదించారు.
తన క్లయింట్పై మోపిన అభియోగాలపై చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీచేయడం సరికాదన్నారు. దీంతో, న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వీ అఫ్జల్ పుర్కర్.. ఈ కేసులో ఈడీ వాదనల కోసం ఈ నెల 16కి వాయిదా వేశారు.